Breaking News

15/05/2019

గుంటూరులో బెట్టింగుల హిట్

గుంటూరు, మే 15, (way2newstv.in)
ఏపీ రాజధాని కేంద్రమైన‌ గుంటూరులో ఇప్పుడు బెట్టింగుల హిట్ నడుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అప్పుడే గుంటూరులో భారీ ఎత్తున బెట్టింగ్‌లు నడిచాయి. తెలంగాణాలో మహాకూటమి అధికారంలోకి వస్తుందని గుంటూరు కేంద్రంగా భారీ ఎత్తున బెట్టింగులు కాసిన వాళ్లంతా నిండా మునిగి పోయారు. ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్‌ను నమ్ముకుని బెట్టింగ్‌లు వేసిన వారంతా కోట్లలో మునిగిపోయారు. ఇక ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాలు మరో 12 రోజుల్లో వెలువ‌డుతుండడంతో టిడిపి, వైసిపి గెలుపోటములపై మళ్లీ ఇక్కడ భారీ ఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎవరు కొత్త ముఖ్యమంత్రి అవుతారు? ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి? కీలక స్థానంలో ఎవరు గెలుస్తారు? మంత్రిగా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు ? ఇలాంటి పందేలతో పాటు గుంటూరు జిల్లాకు సంబంధించి సైతం వివిధ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపోటములపై ఆయా పార్టీల సానుభూతిపరులు పందేలు కాస్తున్నారు.


గుంటూరులో  బెట్టింగుల హిట్

ఈ క్రమంలోనే జిల్లాలో ఉన్న 3 ఎంపీ సీట్ల పై ఆసక్తికరమైన బెట్టింగ్ జోరుగా నడుస్తోంది. గుంటూరు జిల్లాలో గుంటూరు, నరసరావుపేట, బాపట్ల ఎంపీ సీట్లు ఉన్నాయి. బాపట్ల ఎంపీ సిటు పరిధిలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు పర్చూరు, సంతనూతలపాడు, అద్దంకి, చీరాల ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. గత ఎన్నికల్లో మూడు ఎంపీ సీట్లలో టిడిపి జెండా ఎగిరింది. గుంటూరు నుంచి గల్లా జయదేవ్, నరసరావుపేట నుంచి రాయపాటి సాంబశివరావు, బాపట్ల నుంచి శ్రీ రామ్ మాల్యాద్రి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టిడిపి తరపున తిరిగి సిట్టింగ్ లే పోటీ చేశారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులను జగన్ మార్చేసి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. గుంటూరు టిడిపి నుంచి చివరిలో పార్టీలోకి జంప్ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నరసరావుపేట నుంచి విజ్ఞాన్ సంస్థల ఎండీ లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల నుంచి నందిగం సురేష్ పోటీ చేశారు.రాజకీయ అనుభవం పరంగా చూస్తే లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్ రాజకీయాలకు పూర్తిగా కొత్తవారే. ఈ సారి గుంటూరు జిల్లాలో టిడిపికి గట్టి పోటీ ఇచ్చామని భావిస్తున్న వైసిపి జిల్లాలో 3 ఎంపీ సీట్లలో ఏవైనా రెండు ఎంపీ సీట్లు గెలుచుకుంటామని పందెం కాస్తోంది. మూడు సీట్లలో రెండు ఎంపీ సీట్లు వైసిపికి వస్తే పందెం వైసిపి వాళ్లదే. అదే టిడిపి రెండు ఎంపీ సీట్లు గెలిస్తే పందెం టిడిపి వారికే చెందుతుంది. గుంటూరులో రోజురోజుకు రకరకాల బెట్టింగులు జరుగుతుండగా గత రెండు రోజుల నుంచి ఎంపీ సీట్ల బెట్టింగ్ జోరందుకుంది. వైసిపి నరసరావుపేట, బాపట్ల ఎంపీ సీట్లు ఖ‌చ్చితంగా గెలుస్తామని గుంటూరుపై తమకు ఆశ‌లు ఉన్నాయ‌ని చెబుతోంది. టిడిపి మాత్రం గుంటూరు, బాపట్ల సీట్లను భారీ మెజార్టీతో గెలుస్తున్నామ‌ని… నరసరావుపేటలో కాస్త గట్టి పోటీ ఉన్నా ఎంత తక్కువ మెజార్టీతో అయిన తామే గెలుస్తామని చెబుతోంది.ఇక ఈ రెండు పార్టీల బెట్టింగ్ రాయుళ్ల సందడి ఎలా ఉన్నా నరసరావుపేటలో ఎవరు ? గెలుస్తారో అన్నది అంచనాకు రాలేని పరిస్థితి ఉంది. ఈ లోక్‌స‌భ సెగ్మెంట్‌లో చివరిలో వైసిపి అంచనాలకు మించి పుంజుకోవడంతో రాయపాటి వర్సెస్ లావు మధ్య ట‌ఫ్ ఫైట్ నడిచింది. బాపట్ల సీటు విషయానికి వస్తే గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసిపి సత్తా చాటితే… ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న సెగ్మెంట్లలో టిడిపి సత్తా చాటినట్టు అర్థమవుతోంది. ఇక గుంటూరు ఎంపీ సీటు టిడిపికి ఎడ్జ్‌ కనబడుతోంది. మ‌రి ఎవ‌రి లెక్క‌లు ఎలా ఉన్నా …. ఫైన‌ల్ లెక్క‌లు ఎలా ? ఉంటాయో ఈ నెల 23న తేలిపోనుంది. ఈ ఫైన‌ల్ లెక్క‌ల్లో ఏ పార్టీ బెట్టింగ్ రాయుళ్లు గెలుస్తారో, ఏ పార్టీ బెట్టింగ్ రాయుళ్లు నిండా మునుగుతారో చూడాలి.

No comments:

Post a Comment