Breaking News

27/03/2019

అవుట్ డేటెడ్ పాలిటిక్స్ లో దగ్గుబాటి

ఒంగోలు, మార్చి 27 (way2newstv.in)
పర్చూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత చింతకాయపచ్చడి రాజకీయాలు నెరుపుతున్నారు. ఇంకా ప్రచారానికి ఇరవై రోజులు గడువు కూడా లేదు. అయినా దగ్గుబాటి వెంకటేశ్వరరావు జనం ముందుకు వెళ్లడం లేదు. గడప గడప తొక్కడం లేదు. ఇందుకు కారణాలు తెలియక వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తలలుపట్లుకుంటున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురంద్రీశ్వరి బీజేపీ అభ్యర్థిగా విశాఖ పార్లమెంటు స్థానం బరిలో ఉన్నారు. ప్రజల్లోకి వెళితే దీనిపై నిలదీస్తారేమోనన్న అనుమానంతోనే ఆయన ప్రజల ముందుకు రావడం లేదా? అన్న అనుమానం వైసీపీ నేతల్లో కలుగుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల అభ్యర్థులు జనం ముందుకు వెళుతున్నారు. సూర్యోదయానికి ముందే ప్రచారం ప్రారంభించి అర్థరాత్రి సమయానికి కాని అభ్యర్థులు ఇళ్లకు చేరుకోవడం లేదు. కాని పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం చాలా కూల్ గా కన్పిస్తున్నారు. ఆయన కేవలం రాత్రివేళల్లోనే ప్రచారం చేస్తున్నారు. అది కూడా గ్రామ పెద్దలనే కలసి వస్తున్నారు. రచ్చ బండ వద్దకు వెళ్లి గ్రామ పెద్దలను కలసి తనకు మద్దతివ్వాల్సిందిగా కోరుతున్నారు. 


అవుట్ డేటెడ్ పాలిటిక్స్ లో దగ్గుబాటి

గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిసే ప్రయత్నాలు దగ్గుబాటి చేయకపోవడంపై వైసీపీలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఈ తరహా ప్రచారం ఉండేదంటున్నారు. ఓటర్లను కలవకుండా కేవలం గ్రామపెద్దలను కలిసి వెళ్లేవారు ఆనాటి నేతలు. నాటి రోజులను దగ్గుబాటి గుర్తుకు తెస్తున్నారన్న కామెంట్స్ విన్పిస్తున్నాయి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ అల్లుడిగా, రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు ఉంది. పర్చూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచి కంచుకోటగా మలుచుకున్న నేత. రాజకీయాలు ఆయనకు కొత్త కాదు. ఎందరికో రాజకీయ జీవితాలను అందించిన వ్యక్తి కూడా. అలాంటి దగ్గుబాటి ప్రచారంలో దూకుడుగా వెళ్లకపోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారిందనే చెప్పాలి.మరోవైపు ప్రత్యర్థి ఏలూరి సాంబశివరావు దూకుడుగా వెళుతున్నారు. ఇంటింటికి ప్రచారాన్ని ఇప్పటికే రెండు విడతలను ముగించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అసంతృప్తులను బుజ్జగించారు. వైసీపీ నేతలను కూడా కొందరిని తనవైపు తిప్పుకోగలిగారు. ఈసారి కూడా గెలుపు తనదేనన్న ధీమాలో ఏలూరు సాంబశివరావు ఉన్నారు. దగ్గుబాటి మాత్రం అవుట్ డేటెడ్ పాలిటిక్స్ నడుపుతున్నారని చెబుతున్నారు. అయితే దగ్గుబాటికి తనకు ఎలా గెలవాలో తెలుసునని, ఓటర్లను కలిసినంత మాత్రాన గెలిచినట్లు కాదని నవ్వి ఊరుకుంటున్నారట. దగ్గుబాటి ఎత్తులు ఏంటో అర్థం కాక వైసీపీ క్యాడర్ జుట్టు పీక్కుంటోంది. మొత్తం మీద పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యవహారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అక్కడి వైసీపీ నేతలు కొందరు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం

No comments:

Post a Comment