Breaking News

21/03/2019

కేంద్రంలో మోడీ...ఏపీలో బాబు వస్తే...

సోషల్ మీడియాలో చర్చలు
విజయవాడ, మార్చి 21, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే…. మోదీ మళ్లీ వస్తే…? నరేంద్ర మోదీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విజయం సాధించినా మరో ఐదేళ్ల పాటు అభివృద్ధి ఆగిపోవాల్సిందేనా? ఇదే సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఏపీ అభివృద్ధికి మోదీ అడ్డుపడుతున్నారంటూ గత ఏడాదికాలంగా చంద్రబాబునాయుడు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ధర్మ పోరాట దీక్షల పేరుతో మోదీని తిట్టిన తిట్టుకుండా తిట్టిపోశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే మోదీకి ఓటేసినట్లేననే చెప్పిన చోట చెప్పకుండా చెప్పేస్తున్నారు. చంద్రబాబు ఇలా వ్యక్తిగతంగా మోదీపై మాటల దాడికి దిగడం, ఆయనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుకు ప్రయత్నించడం వంటివి భవిష్యత్తులో ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆందోళన మేధావుల్లోనూ వ్యక్తమవుతుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో గత నెలన్నర ముందుకంటే మోదీ, ఆయన పార్టీ బాగా పుంజుకుందన్న వార్తలు వస్తున్నాయి. బాగల్ కోట్ సర్జికల్ స్ట్రయిక్స్ తో మోదీ ఇమేజ్ బాగా పెరిగిందంటున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో మోదీ ప్రభావం ఈసారి కూడా ఉంటుందని సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. 


కేంద్రంలో మోడీ...ఏపీలో బాబు వస్తే...

గతంలో వచ్చిన స్థానాలు రాకపోయినా మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో బీజేపీ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.ఇదే జరిగితే ఇక్కడ మరోసారి చంద్రబాబునాయుడు అధికారంలోకివస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలంగా లేదు. ఒక్క సీటు రావడం కూడా కష్టమే. అలాంటి పార్టీతో శత్రుత్వాన్ని మరింత పెంచుకుని చంద్రబాబు తప్పు చేశారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మోదీ కేంద్రంలో అధికారలోకి వస్తే చంద్రబాబు ఇక్కడ పవర్ లో ఉండకూడదన్న విశ్లేషణలు కూడా వినపడుతున్నాయి. మోదీ అక్కడ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ఇక్కడ ముఖ్యమంత్రి అయినా ఏపీ మరో ఐదేళ్ల పాటు వెనక్కు వెళుతుందన్నది సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది.మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తాను ఎవరికి మద్దతిచ్చేది లేదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తాము అండగా ఉంటామని చెబుతున్నారు. ఇక్కడ జగన్ సేఫ్ రోల్ ప్లే చేశారనే చెప్పుకోవాలి. మరోసారి మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వరన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే విభజన హామీలు అనేకం పెండింగ్ లో ఉన్నాయి. అవి నెరవేరాలంటే కేంద్రంలో కిచిడి సర్కార్ వస్తే సాధ్యంకాదు. మిగిలిన రాష్ట్రాలు ఏపీ ప్రయోజనాలకు అడ్డుపడతాయన్నది వాస్తవం. అందుకే చంద్రబాబు గత వారం రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో మోదీపై విమర్శలను తగ్గించారంటున్నారు. కేవలం జగన్ పై విమర్శలకే ఆయన పరిమితమయ్యారు. మరి మోదీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీ పరిస్థితి ఏంటన్న చర్చకు సమాధానం మాత్రం లేదు

No comments:

Post a Comment