Breaking News

20/03/2019

కాంగ్రెస్ నేతలకు పార్లమెంట్ ఎన్నికలు చావో రేవో

హైద్రాబాద్, మార్చి 20, (way2newstv.in)
తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలకు లోక్‌సభ ఎన్నికలు కఠిన పరీక్షగా మారనున్నాయి. తాడోపేడో తేల్చుకోవాలనే వ్యూహంతో పార్టీ అధిష్టానం ఈసారి అగ్రనేతలను రంగంలోకి దింపడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు రాజకీయ ప్రయోజనం చేకూరకపోగా నష్టమే జరిగింది. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ చేతిలో భంగపడింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలనే గెలుచుకుంది. దీనికితోడు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి క్యూ కడుతుండటం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలను రెండు రకాలుగా ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే కీలక నేతలను రంగంలోకి దింపిందనే చర్చ జరుగుతోంది. నేతల చరిష్మాతోపాటు సామాజిక సమీకరణాలు, జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు ఉండే సానుకూలతలను కలిపితే మెరుగైన ఫలితాలు వస్తాయనే అంచనాతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ జరుగుతోంది.టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా ఏడు స్థానాల్లో కీలక నేతలను బరిలోకి దించిన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి చావోరేవో అనే పరిస్థితి తెచ్చిపెట్టనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల ఫలితాలనుబట్టి పార్టీ నేతల సత్తా ఏమిటో తెలుస్తుందని, ఎన్నికల ఫలితాల సరళికి అనుగుణంగా అవసరమైతే పార్టీని ప్రక్షాళన చేసేందుకే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ గాంధీ భవన్‌ వర్గాల్లో జరుగుతోంది. 


కాంగ్రెస్ నేతలకు పార్లమెంట్ ఎన్నికలు చావో రేవో


కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకు ఖమ్మం మినహా 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ (నల్లగొండ)తోపాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్‌ (కరీంనగర్‌), ఎ. రేవంత్‌రెడ్డి (మల్కాజిగిరి), మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (భువనగిరి), ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్‌ (నిజామాబాద్‌), కార్యదర్శి వంశీచందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ (మహబూబాబాద్‌), ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), మాజీ పార్లమెంటు సభ్యులు మల్లురవి (నాగర్‌కర్నూలు), రమేశ్‌ రాథోడ్‌ (ఆదిలాబాద్‌) తదితరులున్నారు. జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, డి.కె. అరుణ లాంటి నేతల పేర్లు కూడా వినిపించినా వారు పోటీకి విముఖత చూపడంతో వారిని బరిలోకి దించలేదు. అయితే ఉత్తమ్‌ని నల్లగొండ నుంచి పోటీ చేయాలని స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీయే ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ విషయంలో నల్లగొండ జిల్లా నేతల మధ్య కొన్ని తర్జనభర్జనలు జరిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాల్సిందేనని రాహుల్‌ ఆదేశించడంతో ఉత్తమ్‌ బరిలోకి దిగాల్సి వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఇంతమంది ముఖ్య నేతలను ఈసారి పోటీకి నిలపడం వెనుక కాంగ్రెస్‌ అధిష్టానం వ్యూహం భారీగానే ఉందని తెలుస్తోంది.  దీంతోపాటు ఎన్నికల బరిలో లేని జానా, భట్టి, డి.కె. అరుణ, శ్రీధర్‌బాబు, షబ్బీర్‌ అలీ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డి లాంటి మరికొందరు కీలక నేతలకు లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జులుగా బాధ్యతలు అప్పగించి అభ్యర్థులను గెలిపించే బాధ్యత అప్పగించింది. దీంతో ఈ ఎన్నికల్లో రాష్ట్ర నేతల సత్తా తేలిపోతుందని, ఫలితాలకు అనుగుణంగా మార్పుచేర్పులు చేసి పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతో అధిష్టానం ఉందని తెలుస్తోంది.

No comments:

Post a Comment