చిత్తూరు, ఫిబ్రవరి 16, (way2newstv.in)
ప్రతిపక్షాన్ని తొక్కిపెట్టి, అధికారంలోకి తిరిగిరావాలని కలలు కంటున్న చంద్రబాబుకు కొన్ని నియోజకవర్గాల్లో నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. టికెట్ల రేసులో నాయకులు కొట్టుకుంటూ.. పార్టీని పట్టించుకోవడం మానేశారు. దీంతో ఈ పరిణామం… పరోక్షంగా వైసీపీకి మేలు చేస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ పునాదులు గట్టి పడుతున్నాయి. ఈ క్రమంలో వీటిని ఛేదించి టీడీపీకి అనుకూలంగా మార్చాల్సిన ముఖ్య నాయకులు టికెట్ రేసులో తలమునకలవుతున్నారు. నగరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ గత ఏడాది హఠాన్మరణం చెందారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయాల్సి ఉంది. ఆయన లేకపోవడంతో ఈ టికెట్ను ఆయన కుమారుల్లో ఒకరికి ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపారు. కానీ, గాలి ముద్దుకృష్ణమ ఇద్దరు కుమారులు కూడా ఈ టికెట్ కోసం పట్టుబడుతున్నారు.
టిక్కెట్ రేసులో తమ్ముళ్ల తగువులాట
గాలి భానుప్రకాశ్, గాలి జగదీశ్లు టికెట్ను తమకంటే తమకేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఇద్దరూ రెండు వర్గాలు ఏర్పాటు చేసుకుని ప్రచారం ప్రారంభించారు. దీనికితోడు గాలి సతీమణి సరస్వతమ్మ కూడా రంగంలోకి వస్తున్నారని సమచారం. ఆమెకు ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా.. సంతృప్తి చెందడం లేదు. ఈ కుటుంబ రాజకీయం మొత్తం కూడా ఎమ్మెల్యే టికెట్ కోసమే అన్నట్టుగా నియోజకవర్గంలో తలపడుతోంది. ఇదిలావుంటే, స్థానిక సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలల చైర్మన్ అశోక్ రాజు కూడా పోటీ వస్తున్నారు. ఆయన కూడా పోటీకి సిద్ధమేనని సిగ్నల్ ఇచ్చారు. వీరికి తోడు ఇప్పుడు మరో మహిళా డాక్టర్ రంగంలోకి దిగారు. నగరి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డాక్టర్ సుభాషిణి ఏకంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. తన మనసులో మాటను అధినేత వద్ద వెల్లడించారు. దీంతో ఇప్పుడు ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వాస్తవానికి గాలి ఫ్యామిలీ అంటే అమితమైన అభిమానం ఉన్న చంద్రబాబు ఈటికెట్ను ఆయన కుమారుల్లో పెద్ద వాడైన భాను కు ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ, ఇద్దరు అన్నదమ్ములు టికెట్ కోసం వీధి పోరాటాలకు దిగుతుంటే మాత్రం సహించలేకపోతున్నారు. ఎలాగూ వైసీపీ నుంచి మహిళా నాయకురాలు ప్రస్తుత ఎమ్మెల్యే రోజా రంగంలోకి దిగే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఈమెకు పోటీగా మహిళా నేతగా డాక్టర్ను నిలబెట్టడమే మంచిదని భావిస్తున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే.. పిట్టపోరు…. పిట్టపోరు….పిల్లి తీర్చిన చందంగా ఈ టికెట్ను గాలి ఫ్యామిలీ కాకుండా బయటవారు కొట్టేయడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏంజరుగుతుందో చూడాలి
No comments:
Post a Comment