విశాఖపట్టణం, ఫిబ్రవరి 12, (way2newstv.in)
గ్రేటర్ విశాఖలో గట్లు క్రమంగా రూపు మారిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఆక్రమణలతో కొన్ని, పూడ్చివేతతో మరికొన్ని మాయమవుతున్నాయి. గెడ్డలను సంరక్షిస్తామని, ఆధునికీకరణ చర్యలు చేపడతామని జివిఎంసి అధికారులు నిరంతరం ప్రకటనలు గుప్పిస్తున్నారు తప్ప ఆ దిశగా చర్యలు కానరావడం లేదు. ఒకటో వార్డు పరిధిలోని ముడసర్లోవ రిజర్వాయర్ నుంచి పార్కు, గోల్ఫ్కోర్టు మీదుగా శ్రీకాంత్నగర్, సూర్యతేజనగర్లను ఆనుకొని పెదగదిలి, హనుమంతువాక, ఎంవిపి కాలనీ, లాసన్స్బే కాలనీల మీదుగా ఉన్న ఓ విశాలమైన గెడ్డ సముద్రంలో కలుస్తోంది. ఇది గతంలో 50 అడుగుల వరకు విస్తరించి ఉండేది.
ఉందిగా జాగా...వేసేయ్ పాగా
ఆక్రమణలతో ప్రస్తుతం 10 అడుగుల కంటె ఎక్కువ వెడల్పు కనిపించడం లేదు. శ్రీకాంత్నగర్ వద్ద ఈ గెడ్డను ఆనుకొని కార్పొరేట్ ఆసుపత్రులను నిర్మిస్తున్నారు. వాటి నిర్వాహకులు మట్టిని ఈ గెడ్డ అంచున వేయడంతో అది కాస్త చిన్నపాటి పిల్లకాలువలా మారింది. స్కిల్ డవలెప్మెంటు ఇనిస్టిట్యూట్కు ఆనుకొని ఉన్న గెడ్డను కూడా నిర్వాహకులు చాలా వరకు కప్పేశారు. ఒకప్పుడు 40 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ గెడ్డ 10 అడుగులకు కుచించుకుపోయింది. ఇదంతా బహిరంగంగానే కనిపిస్తున్నా జివిఎంసి అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. దీంతో వర్షపు, వాడుక నీరు సజావుగా పోయే తోవలేక మురుగు ఎక్కడికక్కడ నిల్వ ఉండిపోతోంది. ఫలితంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే వర్షాకాలంలో గెడ్డను ఆనుకుని ఉన్న ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా అధికారులు గెడ్డలను కప్పేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గెడ్డలను ఆధునీకరించాల్సి ఉందని వారు చెబుతున్నారు.
No comments:
Post a Comment