Breaking News

10/08/2018

లైవ్ లో తీర్పు ప్రకటించిన వినియోగదారుల ఫోరం

విజయవాడ ఆగస్టు 10, (way2newstv.in)
మల్టీప్లెక్స్‌లలో అధిక ధరలకు తినుబండారాల విక్రయంపై జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు వెలువరించింది. ఏపీలోని విజయవాడలో గల షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌ థియేటర్లకు వినియోగదారుల ఫోరమ్ మొట్టికాయ వేసింది. సీల్డ్ ప్యాక్‌లో ఉన్న తినుబండారాలు థియేటర్లలోకి అనుమతించాలని కోర్టు ఆదేశించింది. మల్టీప్లెక్స్‌ థియేటర్లలలో అధిక ధరలకు విక్రయాలపై వినియోగదారులు ఫోరంను ఆశ్రయించారు. మార్గదర్శక సమితి సహకారంతో గత ఏడాది ఏప్రిల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. పలు వాదనలు అనంతరం జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పును వెల్లడించింది. వినియోగదారులను నిలువునా దోచుకుంటున్న మల్టీప్లెక్స్‌లపై విజయవాడలోని వినియోగదారుల న్యాయస్థానం ఊహించని ఝలక్ ఇచ్చింది. నిబంధనలను తుంగలో తొక్కి అధిక ధరలతో వస్తువులు విక్రయిస్తోన్ నగరంలోని ఐదు మల్టీఫ్లెక్స్‌ల యాజమాన్యాలకు రూ.25 లక్షల భారీ జరిమానా విధించింది. 



లైవ్ లో తీర్పు ప్రకటించిన వినియోగదారుల ఫోరం

బయట నుంచి తెచ్చుకునే తినుబండారాలు, మంచినీరును థియేటర్లలోకి అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని తూనికలు, కొలతల శాఖను ఆదేశించింది. మల్టీప్లెక్స్ థియేటర్లలో టిక్కెట్లు, ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ మార్గదర్శక సమితి సహకారంతో కొందరు గతేడాది ఏప్రిల్‌లో వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఎల్‌ఈపీఎల్‌, ట్రెండ్‌సెట్‌, పీవీఆర్‌, పీవీపీ, ఐమ్యాక్స్ థియేటర్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిని విచారణకు స్వీకరించిన కన్జ్యూమర్ ఫోరం మల్టీఫ్లెక్స్ యాజమాన్యాలతోపాటు తూనికలు, కొలతల శాఖకు నోటీసులు జారీచేసింది. అనేక సార్లు వాద ప్రతివాదాలు జరగ్గా సమగ్ర విచారణ అనంతరం గురువారం తీర్పును వెల్లడించింది. న్యాయమూర్తి మాధవరావు ఈ అంశంపై సంచలన తీర్పు వెలువరించారు. మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఎమ్మార్పీ కంటే మూడురెట్లు అధికంగా ధరను ముద్రించి వినియోగదారులను మోసం చేసినట్టు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. అందుకే వినియోగదారులు నష్టపోయిన మొత్తాన్ని 9శాతం వడ్డీతో సహా పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. ఒక్కొక్క థియేటర్‌కు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.25 లక్షల జరిమానాగా విధించారు. దీన్ని రెండు నెలలల్లోగా జిల్లా వినియోగదారుల ఫోరంలో జమచేయాలని స్పష్టం చేశారు. ఇలాంటి మోసాలకు పాల్పడటం తీవ్రమైన నేరమని, భవిష్యత్‌లో పునావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఉద్ఘాటించారు. అంతేకాదు థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఉచిత తాగునీరు సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని, బయట నుంచి తీసుకొచ్చే ఆహార పదార్థాలు, శీతల పానీయాలను అనుమతించాలని ఆదేశించారు. బయట 20 రూపాయలకు విక్రయించాల్సిన పాప్‌కార్న్‌ ప్యాకెట్‌ను రూ.100లకు పైగా, 650 ఎంఎల్‌ కూల్‌డ్రింక్‌ను రూ.150 నుంచి రూ. 180 మధ్య అమ్మడం. పాప్‌కార్న్‌ కాంబోప్యాక్‌లకు రూ. 300 వరకూ వసూలు చేస్తూ నిలువునా దోచేస్తున్నారు. ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులకు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అయినా సరే కొన్ని చోట్ల తమ ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. ఈ దోపిడీలపై ఫిర్యాదులు రావడంతో అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. అధిక ధరలపై ప్రేక్షకులు ఫిర్యాదు చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబరు. 180042500333, వాట్సాప్‌ నంబరు 7330774444ను థియేటర్లు ప్రదర్శించాల్సి ఉంటుంది. 

No comments:

Post a Comment