రేషన్ కార్డులకు నీలి కిరోసిన్ పంపిణీని జూలై నుంచి ప్రభుత్వం బంద్ చేసింది. జూన్కు సంబంధించి డీలర్లకు కేటాయించిన కోటాలో కేవలం 20 శాతం మాత్రమే సరఫరా చేసినట్లు తెలిసింది. అదీ కూడా మేలో కిరోసిన్ హోల్సేల్ డీలర్ల వద్ద మిగులు సరుకును డీలర్లకు అధికారులు సర్దుబాటు చేసినట్లు తెలిసింది. ఈ కొద్ది సరుకును కార్డుదారులకు ఎలా పంపిణీ చేయాలో దిక్కుతోచని పరిస్థితి కనిపిస్తోంది.తెల్లకార్డుదారు లకు బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు చౌక దుకాణాల నుంచి పంపిణీ చేస్తామని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి రాగానే ఒక్కో సరుకునూ కోత పెడుతూ వస్తోంది. గతంలో బియ్యంతో పాటు పామాయిల్, చక్కెర, కందిపప్పుతో పాటుగా చింతపండు, ఉప్పు, కారం, పసుపు కూడా పంపిణీ చేసేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిగా పామాయిల్, అటు తరువాత చింతపండు, ఉప్పు, కారం, పసుపు పంపిణీ నిలిపివేసింది. ఆ తరువాత కందిపప్పు, గత నెలలో చక్కెర, ఈ నెలలో కిరోసిన్... ఇలా ఒక్కొక్కటిగా మూడేళ్లలో తొలగించింది. ప్రస్తుతం బియ్యం ఒక్కటే పంపిణీ చేస్తున్నారు.
కిరోసిన్ కోటా...కట్ చేసేశారు...
బియ్యానికి కూడా త్వరలో మంగళం పాడే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.కిరోసిన్ పంపిణీ బంద్ చేయడంతో గ్యాస్ కనెక్షన్ లేని పేదల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి వారు కట్టెల పొయ్యిపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. పొగరహిత జిల్లాగా మారుస్తామని చెబుతున్న అధికారులకు ఇదెలా సాధ్యమో తెలియాలి. జిల్లాలో గ్యాస్ లేని తెల్లకార్డుదారులకు దీపం పథకం కింద 1.50 లక్షల కనెక్షన్లు మంజూరు చేసి వంద శాతం లక్ష్యం పూర్తిచేశామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా జిల్లావ్యాప్తంగా దాదాపు లక్ష మందికి గ్యాస్ కనెక్షన్ లేనట్లు సమాచారం. జిల్లాలో 11.92 లక్షలు తెల్ల కార్డులు ఉన్నాయి. పింక్ కార్డులు 80 వేలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 12.72 లక్షల కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో11,37,236 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో సాధారణ కనెక్షన్లు 5,24,294, దీపం కనెక్షన్లు (కొత్తగా మంజూరు చేసిన వాటితో కలిపి) 5,31,067, సీఎస్ఆర్ 39,225, ఉజ్వల పథకం కనెక్షన్లు 2,650 ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 12.72 లక్షల కార్డులు ఉంటే గ్యాస్ కనెక్షన్లు 11.37 లక్షలు ఉన్నాయి. అంటే 1.35 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు లేవనేది స్పష్టమవుతోంది
No comments:
Post a Comment