Breaking News

13/04/2019

సైలెంట్ వేవా... ప్రభుత్వ వ్యతిరేకతా

విజయవాడ, ఏప్రిల్ 13, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు పోటెత్తారు. దాదాపు 80 శాతం పోలింగ్ జరిగింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు సయితం మండుటెండను సయితం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చారు. ఇంతటి భారీ స్థాయిలో పోలింగ్ జరగడానికి రెండు ప్రధాన పార్టీలు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సైలెంట్ వేవ్ ఉందని చెబుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఓటర్లు తరలి రావడానికి కారణాలేంటి? ప్రభుత్వంపై వ్యతిరేకతా? లేక అభివృద్ధి కొనసాగాలని ప్రభుత్వ అనుకూలతా? అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పసుపుకుంకుమ, పింఛన్లు వంటివి అమలు చేయడంతో మహిళలు, వృద్ధులు ఎండను సయితం లెక్క చేయకుండా క్యూలో నిల్చున్నారని తెలుగుదేశం పార్టీ లెక్క వేసుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సయితం ఊహించని వేవ్ ఉందని పేర్కొన్నారు. 


సైలెంట్ వేవా... ప్రభుత్వ వ్యతిరేకతా

జగన్ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆగిపోతుందని భావించి మహిళలు, వృద్ధులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్లు వచ్చారని ఆయన అన్నారు. ఇందులో కొంత నిజం లేకపోలేదంటున్నారు. జగన్ వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని ఆందోళన చెందే ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చారన్నది టీడీపీ అభిప్రాయం.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెక్క వేరేలా ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన, జగన్ పాదయాత్ర వల్లనే జనం పోటెత్తారంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. జగన్ దాదాపు ఏడాదిన్నర పాటు ఎండనక, వాననక తమ గ్రామాలకు వచ్చారని, రాజన్న బిడ్డ అంత కష్టపడితే ఒక్కరోజు మనం ఓటు కోసం సమయం కేటాయించలేమా? అని మహిళలు, వృద్ధులు వచ్చారన్నది వైసీపీ లాజిక్ గా విన్పిస్తోంది. జగన్ పాదయాత్ర ప్రభావమే ఈ పోల్ పర్సంటేజ్ అన్నది వైసీపీ భావన. ప్రభుత్వ వ్యతరేకత ఉన్నప్పుడే ఇంతటి భారీ స్థాయిలో పోలింగ్ జరుగుతుందన్నది వైసీపీ వాదన.తెలంగాణలో జరిగిన ఎన్నికలతో పోల్చి చూస్తున్నారు టీడీపీ నేతలు. అక్కడ పోల్ పర్సంటేజ్ ఎక్కువ కావడం, అధికార పార్టీయే లబ్దిపొందడాన్ని గుర్తు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. కేసీఆర్ మాదిరిగానే తాము కూడా మ్యాజిక్ ఫిగర్ ను సులువగా చేరుకుంటామని చెబుతున్నారు. కానీ వైసీపీ మాత్రం తెలంగాణ పరిస్థితులు వేరని, ఇక్కడ ఐదేళ్లలో అభివృద్ది చేయకుండానే, ప్రజలకు మాయమాటలు చెప్పిన చంద్రబాబును ఓడించడానికే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారంటున్నారు. ఎవరి లాజిక్ వాళ్లదే. జడ్జిమెంట్ లాక్ అయింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

No comments:

Post a Comment