Breaking News

13/01/2020

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి

ఏలూరు, జనవరి 13  (way2newstv.in)
మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణించిన సనాతన హైందవ సంస్కృతిలో ప్రకృతి పరిశీలన, దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి. దీనికి ముందు వెనుక కాలాన్ని పుణ్యతమమని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. మంచి పనికి కాలంతో పనిలేదనే సిద్ధాంతాన్ని పక్కనబెడితే, కొన్ని కాలాల్లో మంచి పనులకు సానుకూలమైన పరిస్థితి ఉంటుంది. పవిత్రమైన, శాస్త్రోక్త సత్కర్మలకు ఈ పుణ్యకాలం ప్రధానమైందని ఆగమాలు విశదీకరిస్తున్నాయి. శుద్ధికి, సిద్ధికి శీఘ్ర ఫలకారిగా అనుకూలించే సమయం. దేశమంతటా ఈ పర్వదినానికి ప్రాముఖ్యమున్నా, ఆచరించే పద్ధతుల్లో మాత్రం భిన్నత్వం కనిపిస్తుంది‘తిల సంక్రాంతి’గా కొన్నిచోట్ల వ్యవహరించే ఈ పర్వంలో నువ్వుల్ని దేవతలకు నివేదించి, పదార్థాల్లో ప్రసాదాల్లో వినియోగిస్తారు. అంతే కాదు తెల్ల నువ్వుల్ని, మధుర పదార్థాలను పంచుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకునే సంప్రదాయం ఉంది. వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో పంటలు చేతికొచ్చే కాలం ఇది. 
తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి

సంపదను, ఆనందాన్ని కుటుంబంతో, సమాజంతో పంచుకుని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి. ఆధ్యాత్మికతతోపాటు మానవ సత్సంబంధాల సౌహార్దమూ పండుగల సత్సంప్రదాయాల్లో కలిసి ఉంటుంది.సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్ధం. ఎలాగంటే పాడి పంటలు సమృద్ధిగా ఇళ్లకు వచ్చే కాల సమయం. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి, ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలలో పనికిరాని బట్టలు, వస్తువులను వేసి పీడలను, అరిష్టాలను తొలగించుకుంటారు. తెల్లవారక ముందే భోగి మంటలతో మొదలుకుని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభం అవుతుంది. మనలో ఉన్న బద్దకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుంచి కొత్త సంతోషం, ఆప్యాయతలతో కూడుకుని ఉన్న జీవితాన్ని ప్రారంభిస్తున్నామని ఆత్మారామునికి మాట.. ఇచ్చి భవగత్ సన్నిధిలో నిశ్చయ సంకల్పం చేసుకోవడం జరుగుతుంది.రంగవల్లుల శోభలో దివ్యత్వం, కళానైపుణ్యం గోచరిస్తాయి. ప్రతి ఇంటి ముంగిలీ ఒక పత్రంగా, చుక్కలను కలుపుతూ చిత్రించే అబ్బురమైన ముగ్గులు చిత్రాలుగా కనిపిస్తాయి. స్నానం, దానం, పితృతర్పణం, జపతపాలు, దేవతార్చనలు- సంక్రాంతి ముఖ్య విధులుగా శాస్త్రాలు నిర్దేశించాయి. దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుషులు, ప్రకృతి పట్ల కృతజ్ఞత, ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంత్రికి ప్రాధాన్యముంది. సంక్రాంతి పుణ్యదినాన ఇచ్చే దానాలు అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తిపై శ్రద్ధ ఈ సత్కార్యాలను ప్రేరేపిస్తోంది.కనుమ పండుగను ఆంధ్రా రాయల సీమ ప్రాంతాల్లో రైతులు ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రైతులు తమ పాడి పశువులను, దొడ్లను శుభ్రంగా కడిగి, పూల తోరణాలు కట్టి మామిడి తోరణాలతో అలంకరించి పశువులకు సైతం కుంకుమ బొట్లు పెట్టి మెడలో పూల దండలు వేసి వాటి ప్రత్యేక మైన దాణాను అందచేస్తారు. గోపూజ నిర్వహిస్తారు. పంట చేల వద్ద కొంత మంది రైతులు రేగాకు , ఎముక, జిల్లేడు ఆకులను ఉంచి ఉదయాన్నే ఇంట్లో వండిన పులాగాన్ని పంటలపై చల్లడం పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం. సంక్రాంతి పండుగ మూడు రోజులు ఆంధ్రా ప్రాంతంలో మూడు రోజులు జరుపుకుంటే తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఒకటి , రెండు రోజులే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

No comments:

Post a Comment