Breaking News

23/01/2020

సీమ, ఉత్తరాంధ్ర మద్దతు కోసం జగన్

విజయవాడ, జనవరి 23 (way2newstv.in)
తెలుగుదేశం పార్టీ మూడు రాజధానుల బిల్లులను అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారు. అందులో వాస్తవం. కానీ ఒక విధంగా జగన్ సక్సెస్ అయ్యారనుకోవాలి. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా చూస్తే జగన్ కావాలనే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు కనపడుతుంది. శాసనమండలిలో సీఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లు పాస్ అయి ఉంటే ఇంత చర్చ ఉండదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో దీనిపై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. తమకు రావాల్సిన వాటిని చంద్రబాబు అడ్డుకుంటున్నారన్న భావన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల్లో నెలకొనే అవకాశముంది.నిజానికి శాసనమండలిలోనూ ఈ బిల్లులు పాస్ కావాలంటే జగన్ వేరే మార్గాన్ని ఎంచుకునే వారు. ఆర్థిక బిల్లులుగా ప్రవేశపెట్టి టీడీపీకి చెక్ పెట్టే అవకాశం ఉంది. కానీ జగన్ అటువైపు చూడలేదు.
సీమ, ఉత్తరాంధ్ర మద్దతు కోసం జగన్

శాసనసభలో ఏమీ చేయలేని తెలుగుదేశం పార్టీ శాసనమండలిలో ఖచ్చితంగా అడ్డు తగులుతుందని జగన్ కు తెలియంది కాదు. అలాగే సెలెక్ట్ కమిటీకి బిల్లు వెళుతుందన్నది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊహించిందే. జగన్ కు కావాల్సింది అదే. టీడీపీకి తాత్కాలిక ఆనందాన్నే జగన్ మిగిల్చారంటున్నారు.రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు మరో మూడు నెలల పాటు వాయిదా పడక తప్పని పరిస్థితి. అయితే ఇప్పటికే శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ చేసిన హడావిడి, ఆ తర్వాత రాజధాని ప్రాంత గ్రామ ప్రజలు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణకు పట్టిన నీరాజనాలు చేసిన ఇతర ప్రాంత ప్రజలకు కొంత అవమానకరంగానే భావిస్తారన్నది వైసీపీ అంచనా. ముఖ్యంగా సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జగన్ తమకు మంచి చేసే ప్రయత్నం చేేస్తే దానిని చంద్రబాబు అడ్డుతగిలారన్న భావన నెలకొనే అవకాశముంది.తెలుగుదేశం పార్టీ ఆ రెండు ప్రాంతాల ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. సీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం 29 గ్రామాల ప్రజల కోసం తమ అధినేత తమకు పట్టున్న ప్రాంతాల్లో బలహీనమయ్యేలా చేసుకున్నారన్న ఆవేదన కూడా టీడీపీ నేతల్లో విన్పిస్తుండటం విశేషం. మొత్తం జగన్ ఇది కావాలనే చేసినట్లు కనపడుతుంది. టీడీపీని రాజకీయంగా ఇబ్బందుల పాలు చేసే క్రమంలో జగన్ సక్సెస్ అయ్యారంటున్నారు వైసీపీ నేతలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

No comments:

Post a Comment