చంద్రశేఖరుడ్ని ఇరుకున పెడుతున్న జగన్
విజయవాడ, డిసెంబర్ 16 (way2newstv.in):
ఏపీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు, తెలంగాణ ఉద్యమ సారధి, సీఎం కేసీఆర్ అదే జగన్ పాలనతో ఇరుకున పడుతున్నారా ? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు నుంచి ఐదు విషయాల్లో జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు తెలంగాణకు చెందిన రాజకీయ ప్రముఖులు. ఏపీ ఎఫెక్ట్ తెలంగాణపై భారీగా ఉందని వారు చెబుతున్నారు. విషయంలోకి వెళ్తే.. ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఏపీ సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి ఆర్టీసీని ప్రజారవాణాగా మారుస్తూ.. ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేయనుంది.ఈ ప్రక్రియ అత్యంత సాహసోపేతమైనప్పటికీ.. జగన్ పట్టుబట్టి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దీనిని ముందుకు తీసుకు వెళ్తున్నారు.
ఆరు నెలలు... ఆరు విషయాలు
ఇది ఏపీలోని ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల విషయంలో హర్షాతిరేకాలు నింపింది. అయితే, అదే సమయంలో ఇదే తరహాలో తమకు కూడా న్యాయం చేయాలంటూ.. తెలంగాణలో కార్మికులు ఉద్యమించారు. దాదాపు 51 రోజులు అక్కడ ఆర్టీసీ సమ్మె కూడా జరిగింది. మీ మిత్రుడు, ఆర్థిక లోటులో ఉన్న ఏపీకి సారథ్యం చేస్తున్న జగన్ ఆర్టీసీని విలీనం చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేరంటూ.. అక్కడ కేసీఆర్ను కార్మికులు నిలదీశారు. అయితే, తాను చేయలేనని, చేసేది లేదని నిర్మొహమాటంగా చెప్పిన కేసీఆర్. దీని నుంచి అతి కష్టం మీద బయటపడ్డారు. ఇంతలోనే ఇప్పుడు ఆయనకు రెండు విషయాల్లో మళ్లీ అగ్ని పరీక్ష ఎదురైంది.ఒకటి మద్య నియంత్రణ లేదా పూర్తిగా మద్యాన్ని ఎత్తేయడం, రెండు దిశ ఘటన. ఈ రెండు విషయాల్లోనూ ఏపీ తీసుకున్న నిర్ణయాలు, చట్టాలను కేసీఆర్ ఎందుకు చేయలేక పోతున్నారని అక్కడి రాజకీయ నాయకులు కేసీఆర్కు పొగ పెడుతున్నారు. మద్య నియంత్రణ చేస్తానంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు జగన్ రాష్ట్రంలో తొలి దశలో కీలక నిర్ణయం తీసుకుని అమలు చేశారు. 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించడంతో పాటు, బెల్టు షాపులు ఎత్తేశారు. అదే సమయంలో పర్మిట్ రూమ్లు ఎత్తేయడంతోపాటు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తూ.. సమయాన్ని కూడా భారీగా తగ్గించేశారు. ఇప్పుడు దీనిపై తెలంగాణలో ఉద్యమాలు ప్రారంభమమయ్యాయి. మీరు కూడా తెలంగాణలో ఇలానే చేయాలంటూ.. బీజేపీ లేడీ ఫైర్బ్రాండ్ డీకే అరుణ ఉద్యమాలు చేస్తున్నారు. దీనికి ప్రజాసంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.ఇక, తాజాగా హైదరాబాద్లో జరిగిన దిశ ఘటన నేపథ్యంలో ఏపీలో ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం-2019 ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. దీని ప్రకారం మహిళలకు ప్రభుత్వం నుంచి బలమైన రక్షణ లభించడంతోపాటు.. మహిళలను వేదించినా, అత్యాచారం చేసినా కూడా ఉరి వేసే విధంగా జగన్ తాజా చట్టాన్ని తీసుకు వచ్చారు. ఇది మరింతగా తెలంగాణలో వేడి పుట్టించింది. అసలు తెలంగాణలో జరిగిన ఘటనతో పక్కరాష్ట్రం ఏపీ చట్టం తీసుకు వస్తే.. మీరు ఇక్కడ ఫామ్ హౌస్లో కూర్చుని కాలం గడుపుతారా? అంటూ రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో జగన్ నిర్ణయాలు తన మెడకు చుట్టుకుంటున్నాయే అంటూ కేసీఆర్ ఆలోచనలో పడ్డారని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.
No comments:
Post a Comment