Breaking News

20/12/2019

వైకుంఠ దర్శనం రెండు రోజులే

తిరుమల డిసెంబర్ 20 (way2newstv.in)
తిరుమలలో వైకుంఠద్వార దర్శనం పదిరోజుల పాటు కల్పించనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, దీనిపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదనను వెనక్కుతీసుకుంది. కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు మాత్రమే దర్శనం కల్పిస్తామని టీటీడీ పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.తిరుమలలోని శారదాపీఠాన్ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో కలిసి గురువారం నాడు వైవీ సందర్శించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామితో వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి కైంకర్యాలన్నీ ఆగమశాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయని, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రను సంప్రదించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
వైకుంఠ దర్శనం రెండు రోజులే

ఆలయంలో ఉత్సవమూర్తుల అరుగుదల కారణంగా నిత్యాభిషేకాల నిలుపుదల, పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనంపై ఆగమ సలహాదారులు, ఆలయ ప్రధానార్చకులతో కలిసి స్వరూపానందేంద్రతో చర్చించామని, ఆయన సలహాలు స్వీకరించామని వివరించారు. దీనిపై తదుపరి పాలక మండలి సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈసారి మాత్రం వైకుంఠ ఏకాదశి, ద్వాదశిరోజున మాత్రమే వైకుంఠద్వార దర్శనాన్ని కల్పిస్తామన్నారు.అంతకుముందు శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ.. ఉత్సవమూర్తుల అరుగుదల నివారణకు ఆర్జిత సేవలను తగ్గించుకోవడంపై స్వరూపానందేంద్రకు విన్నవించామన్నారు. దీనికి ప్రత్యామ్నాయాలను పరిశీలించాల్సిందిగా ఆయన సూచించారని పేర్కొన్నారు. ఆగమ సలహామండలి సభ్యుడు సుందరవరద భట్టాచార్యులు మాట్లాడుతూ.. స్వరూపానందేంద్ర సలహాతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి ఆర్జిత సేవలను తగ్గించాలని టీటీడీకి సూచించినట్టు తెలిపారు. పూర్వకాలంలో మాదిరిగానే పంచ పర్వోత్సవ రోజుల్లోనే వసంతోత్సవం, అభిషేక సేవలు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. పది రోజులపాటు వైకుంఠద్వార దర్శనాన్ని అమలు చేయవచ్చన్నది నా వ్యక్తిగత అభిప్రాయమని వివరించారు.

No comments:

Post a Comment