Breaking News

05/11/2019

ఐక్యమత్యంతో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి

జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి  నవంబర్ 05(way2newstv.in)  
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో  ప్రజలంతా ఐక్యమత్యంతో  ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన సూచించారు.   పారిశుద్ద్యం పై జిల్లాలో నెల రోజుల పాటు  ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా  జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన మంగళవారం పెద్దపల్లి మండలంలోని పెద్దబోంకూర్ గ్రామాన్ని పరిశీలించారు.  జిల్లా కలెక్టర్ గ్రామం మొత్తం పరిశీలిస్తూ అపరిశుభ్రంగా  ఉన్న ప్రదేశాలు, నీటి నిల్వ అధికంగా ఉన్న ప్రదేశాలు అధికంగా ఉండడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేసారు. గ్రామం పరిశుభ్రంగా  ఉండడంతో పాటు గ్రామంలోని ప్రతి ఇళ్లు, వాటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,  ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలని  కలెక్టర్  ప్రజలకు సూచించారు.  
ఐక్యమత్యంతో   గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి

అనంతరం గ్రామ పంచాయతి ఆవరణలో నిర్వహించిన   కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని గ్రామాల్లో  పరిశుభ్రత  పెంపొదిస్తు వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి నవంబర్ 4 నుంచి డిసెంబర్ 5 వరకు ప్రతి రోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు గ్రామ స్థాయి సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా, నీటి నిల్వలు లేకుండా ఉండే విధంగా  చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో అపరిశుభ్రత అధికంగా ఉందని, గ్రామాల్లోని ఇళ్లలో ప్లాస్టిక్ బకెట్స్,  పాత టైర్లు, కూలర్లలో నీటి నిల్వలు పేరుకుపోయిన కారణంగా అధికంగా దోమలు వ్యాప్తి చెందుతున్నాయని, దీని నివారించడానికి  సర్పంచ్, పంచాయతి కార్యదర్శి, గ్రామ సిబ్బంది కృషి చేస్తున్నారని, వీరికి గ్రామ ప్రజలంతా ఐక్యతగా సహకరించాలని కలెక్టర్  సూచించారు.  రాజకీయాలు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల సమయంలో చేసుకుంటే సరిపోతుందని,  మిగిలిన సమయాల్లో  గ్రామం ఐక్యంగా ఉండాలని, ప్రతి అంశం రాజకీయ దృష్టితో చూస్తే  గ్రామంలో  ప్రజలు అధికంగా అనారొగ్య పాలవుతారని కలెక్టర్ స్పష్టం చేసారు.  పెద్దబోంకూరు గ్రామంలో మన జిల్లా యంత్రాంగం అనేక చర్యలు తీసుకున్నప్పటికి 3 వ్యక్తులు డెంగ్యూ బారినపడ్డారని,  ఈ సంఖ్య పెరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని  లేని పక్షంలో చెడు ఫలితాలు వస్తాయని కలెక్టర్ తెలిపారు. మంచిర్యాల జిల్లాలో  ఒక కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు 15  రోజుల వ్యవధిలో  డెంగ్యూ బారిన పడి మరణించారని, ఆ పరిస్థితి మన గ్రామాలకు రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏ ఒక్కరు  అలసత్వం వహించినా , అందరికి ప్రమాదం వస్తుందని అన్నారు.  మన జిల్లా వ్యాప్తంగా  సుమారు 8 లక్షల జనాభా, 1.25 లక్షల కుటుంబాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరి ఇంటికి  కలెక్టర్, లేదా అధికారి  వచ్చి  పరిశుభ్రత  పరిశీలించాలని అంటే  చాలా కష్టమని, ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరిస్తే  వీటిని  నివారించగలుగుతామని కలెక్టర్ స్పష్టం చేసారు.  గ్రామంలో అంగన్ వాడి కేంద్రం పరిశీలిస్తున్న సమయంలో 3 సంవత్సరాల పిల్ల తాను తిన్న చాక్లెట్ కవర్ ను  చెత్త బుట్టలో వేస్తుందని, మనం మాత్రం చెత్తను రోడ్ల పై వేస్తున్నామని,  పిల్లలకు ఉన్న బాధ్యత మనకు సైతం ఉండాలని  కలెక్టర్ తెలిపారు.  మన గ్రామంలో  చెత్తను రోడ్ల పై వేయటానికి వీలులేదని, అలా చేసే వారి పై  చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కు కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం ప్రారంభించిన 30 రొజుల ప్రత్యేక కార్యచరణ స్పూర్తిని మనం కొనసాగించాలని, మన గ్రామాన్ని పరిశుభ్రంగాఉంచుకోవాలని తెలిపారు.  ప్లాస్టిక్ అధికంగా  వినియోగించడం వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయని, ప్లాస్లిక్ వల్ల  నీరు భూమిలో ఇంకిపోకుండా నిల్వ ఉంటుందని, దాని వల్ల ప్రమాదకరమైన దోమలు వస్తున్నాయని, ప్లాస్టిక్ వినియోగం మనం గ్రామాలో నిషేదించాలని కలెక్టర్  ఆదేశించారు.   గ్రామస్థాయి అధికారులు గ్రామంలోని  ప్రతి ఇంటికి వెళ్లి  పరిసరాలను పరిశీలించాలని, అపరిశుభ్రంగా ఉన్న వారికి పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేని పక్షంలో జరిగే నష్టాల గురించి వివరించాలని కలెక్టర్ తెలిపారు.  గ్రామంలో ఇంకేవరు డెంగ్యూ భారిన పడకుండా జాగ్రత్త పడాలని, గ్రామంలో నిర్మించిన సామూహిక మరుగుదొడ్డి   పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అందులో టైల్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  గ్రామంలో  రైతుల అవసరాల కోసం నూతన ఐకేపీ కేంద్రం ఎర్పాటు చేయవల్సిందిగా  కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.  గ్రామ ప్రజలంతా రాజకీయాలకతీతంగా  ఐక్యతతో  స్వచ్చ గ్రామ సాధన దిశగా, గ్రామంలో నీరు నిల్వ ఉండకుండా  కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.  పెద్దపల్లి ఎంపిడిఒ  రాజు, గ్రామ సర్పంచ్  మానసా,  సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు, తదితరులు ఈ కార్యక్రమంలో  పాల్గోన్నారు.

No comments:

Post a Comment