Breaking News

04/11/2019

మెట్రోలో పెయిడ్ పార్కింగ్ లే

హైద్రాబాద్, నవంబర్ 4, (way2newstv.in)
నగర మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ చార్జీలు మోత మోగుతున్నాయి.ఈ ఫీజును అమాంతం పెంచడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో సేవల్లో భాగంగా ఉచిత పార్కింగ్‌సదుపాయం కల్పించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా చార్జీల భారాన్ని ప్రయాణికులపై మోపడంతో పాటు.. అధికంగా పెంచడంపై సర్వత్రా వ్యతిరేకతవ్యక్తమవుతోంది. మరోవైపుఇప్పటి వరకు ‘ఉచిత పార్కింగ్‌’సదుపాయం ఉన్న కొన్నిస్టేషన్లలో కూడాఆ సదుపాయాన్ని తొలగించిన మెట్రో అధికారులు అన్నిచోట్లా పెయిడ్‌ పార్కింగ్‌ను అమలు చేశారు.పార్కింగ్‌ చార్జీల బాదుడుపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.మెట్రో ద్వారా ప్రయాణికులకు మెరుగైన, సుఖవంతమైన ప్రయాణ సదుపాయం లభిస్తున్నప్పటికీ పార్కింగ్‌ రేట్లు మాత్రం  వాహనదారులకు షాకిస్తున్నాయి. ఉదాహరణకు మెట్రో ప్రారంభమైన తొలినాళ్లలో బేగంపేట్‌ స్టేషన్‌లో వాహనాలకు పార్కింగ్‌ ఫీజును వసూలు చేయలేదు. 
 మెట్రోలో పెయిడ్ పార్కింగ్ లే

ఏడాది తర్వాత నామమాత్రంగా రోజంతా బండి నిలిపితే రూ.10 తీసుకొనేవారు. ఇప్పుడు ద్విచక్ర వాహనానికి 2 గంటలకు రూ.5, 3 గంటలకు రూ.10 చొప్పున గుంజుతున్నారు. 5 గంటల పాటు పార్కింగ్‌ చేస్తే బైక్‌కు రూ.15 చొప్పున చెల్లించాలి. ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు ద్విచక్ర వాహనం పార్కింగ్‌లో ఉంచితే రూ.20 చెల్సించాల్సిందే. ఇక కార్లకైతే పార్కింగ్‌ ఫీజులు బెంబేలెత్తిస్తున్నాయి. కనిష్టంగా 2 గంటలకు రూ.15 చొప్పున వసూలు చేస్తుండగా, గరిష్టంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలిపే వాహనాలకు రూ.50 వరకు చదివించుకోవాల్సి వస్తోంది. ఒక్క బేగంపేట్‌ స్టేషన్‌లోనే కాకుండా నగరంలోని దాదాపు అన్ని మెట్రో స్టేషన్లలో ఇదే పరిస్థితి ఉంది. ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్‌ వరకు 29 కి.మీ మార్గంలో, నాగోల్‌ నుంచి హైటెక్‌సిటీ వరకు 28 కి.మీ మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు మార్గాల్లో 50 స్టేషన్లు ఉండగా వీటిలో సుమారు 30 స్టేషన్లలో పార్కింగ్‌ సదుపాయం ఉంది. అమీర్‌పేట్‌ వంటి ప్రధాన స్టేషన్‌లో గతంలో పూర్తిగా ఉచిత పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. అలాగే ఉప్పల్‌లోనూ ఈ సదుపాయం ఉండేది. కానీ ఇప్పుడు అన్నిచోట్ల పెయిడ్‌ పార్కింగ్‌గా మార్చడం గమనార్హం. మెట్రో రైళ్లలో ప్రతిరోజు సుమారు 3.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరిలో చాలామంది సొంత వాహనాల్లో మెట్రో స్టేషన్‌ వరకు వచ్చి అక్కడ పార్కింగ్‌ చేసి కార్యాలయాలకు వెళుతున్నారు. ఇలా వస్తున్న వారంతా మెట్రో ప్రయాణ చార్జీ కంటే వాహనాల పార్కింగ్‌ చార్జీలే ఎక్కువవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్‌ మెట్రో రైల్వే స్టేషన్‌ వద్ద ఎల్‌ అండ్‌ టీ, పార్క్‌ హైదరాబాద్‌ సంస్థలు పార్కింగ్‌ సదుపాయాలు కల్పించాయి. టూ వీలర్‌కు నెల పాస్‌కు రూ.250, ఓవర్‌ నైట్‌ చార్జ్‌ రూ.30, ఫోర్‌ వీలర్‌కు ఒకరోజు పాస్‌కు రూ.40, నెల పాస్‌కు రూ.750, ఓవర్‌ నైట్‌ చార్జ్‌ రూ.40 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. హెచ్‌ఎంఆర్‌ సంస్థ తరపున ‘పార్క్‌ హైదరాబాద్‌’ పార్కింగ్‌ సదుపాయం కల్పిస్తోంది.  

No comments:

Post a Comment