Breaking News

02/11/2019

మహాలో పట్టువీడని శివసేన, బీజేపీ

ముంబై, నవంబర్ 2 (way2newstv.in)
మహరాష్ట్రలో పీటముడి తొలగడం లేదు. భారతీయ జనతా పార్టీ, శివసేనల మధ్య స్నేహబంధం దెబ్బతినే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇద్దరూ మెట్టు దిగకపోవడంతో ఈసారి ఎవరి దారి వారిదేనా? అన్న చర్చ జరుగుతుంది. ఎవరి దారి వారు వెళ్లినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం అయితే లేదు. ఇద్దరికీ కావాల్సింది అధికారమే. అది అందివ్వడానికి కాంగ్రెస్, ఎన్సీపీలు కాచుక్కూర్చున్నాయి. మరి చివరకు ఎవరు విజయులవుతారో గాని మహారాష్ట్ర పాలిటిక్స్ మాత్రం అనేక మలుపులు తిరుగుతున్నాయి.భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షనేతగా ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవిస్ ఎన్నికయ్యారు. ఆయన త్వరలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని భావిస్తున్నారు. శివసేనకు డిప్యూటీ సీఎంతో పాటు పదమూడు మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ సంకేతాలు పంపింది. 
మహాలో పట్టువీడని శివసేన, బీజేపీ

అయితే ఇందుకు శివసేన అంగీకరించడం లేదు. తమతో ఎన్నికలకు ముందు ఒప్పందం చేసుకున్న ప్రకారం ముఖ్యమంత్రి పదవి సగం సమయం ఇవ్వాల్సిందేనని శివసేన పట్టుబడుతోంది.ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ నేషనలిస్ట్ కాంగ్రెస్ అధినేత శరద్ పవార్ తో కలవడం చర్చనీయాంశమైంది. శివసేన అవసరమైతే కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టు కట్టాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ తమను నమ్మించి మోసం చేసిందని భావిస్తున్న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి తలొగ్గకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే మెట్టు దిగకూడదని నిర్ణయించుకున్నారు. శివసేన కు చెందిన శాసనసభ్యులు కూడా గవర్నర్ ను కలిశారు. తమ శాసనసభ పక్ష నేతగా ఏకనాధ్ షిండే ఎన్నికయ్యారు. గతంలో కూడా ఈయనే వ్యవహరించారు.బీజేపీ కూడా శివసేన కదలికలను నిశితంగా గమనిస్తుంది. శివసేన కాంగ్రెస్, ఎన్సీపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోలేదని ధైర్యంగా ఉంది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వచ్చి చర్చలు జరిపితే శివసేన కొంత తగ్గే అవకాశాలున్నాయని ఆ పార్టీ భావిస్తుంది. అందుకోసమే శివసేనతో ఎటువంటి చర్చలు జరపకుండా వేచి చూసే ధోరణని అవలంబిస్తుంది. మరోవైపు శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తారన్న ప్రచారం కూడా ఉండటంతో మహారాష్ట్ర రాజకీయం గమ్మత్తుగా సాగుతోంది.

No comments:

Post a Comment