Breaking News

01/10/2019

గాంధీ ఆశయాలు కోసం మన్ మే బాపు

న్యూ ఢిల్లీ, అక్టోబరు 1  (way2newstv.in)
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బీజేపీ ఆర్భాటంగా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందింది. గాంధీ ఆశయాల సాధనకు మరే ఇతర పార్టీ కంటే తామే ఎక్కువగా కృషి చేస్తున్నామనే సందేశాన్ని ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నది.స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ నాయకత్వాన్ని ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటూ వచ్చింది. అయితే గాంధీ సిద్ధాంతాలను ఆచరించడంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదంటూ బీజేపీ తమ పార్టీయే గాంధీకి నిజమైన నివాళి అర్పిస్తున్నదని చాటేందుకు జాతిపిత 150 ఘనంగా నిర్వహించడం ద్వారా చాటేందుకు ప్రణాళికలు రూపొందించింది.మోడీ మొదటి సారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే స్వచ్ఛ భారత్ అంటూ పిలుపు నిచ్చారు.
గాంధీ ఆశయాలు కోసం మన్ మే బాపు

గ్రామాల స్వచ్ఛత గాంధీజీ ఆశయమని, స్వచ్ఛ భారత్ సాధన ద్వారా ఆయన ఆశయాలు నెరవేర్చాలనీ అంటూ గాంధీకి నిజమైన వారసులం తామేనని చాటేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. గాంధీ పేరునే తప్ప ఆశయాలను కాంగ్రెస్ విస్మరించిందని విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.ఇప్పుడు గాంధీజీ 150వ జయంతి సందర్భంగా గాంధీ ఆశయలు, ఆదర్శాలను సెమినార్లు, బహిరంగ సభల, స్వచ్ఛతా కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని మోడీ-షాల నేతృత్వంలోని కమలనాధులు కార్యాచరణ రూపొందించారు. మనసులో బాపు అన్న నినాదంతో ఈ కార్యక్రమాలను చేపట్టాలని కేడర్ కు పిలుపు నిచ్చింది.మరో వైపు కాంగ్రెస్ పార్టీ  గాంధీజీ ఆశయాల సాధనకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పుకోవడంలో బీజేపీ అంత దూకుడుగా వెళ్ల లేని పరిస్థితుల్లో ఉంది. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశానికి పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు గైర్హాజరయ్యారు.అదే సమయంలో బీజేపీ మాత్రం గాంధీజీ ఆశయాల సాధనలో ముందున్నామన్న ప్రచారాన్ని దేశ వ్యాప్తంగా మూల మూలలకూ వ్యాపించేలా కార్యాచరణ చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగంలో సైతం స్వచ్ఛత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారు.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం విధించనున్నట్లు ప్రకటించి...స్వచ్ఛతే అభివృద్ధికి రాచబాట అని ప్రకటించారు. అంతే కాకుండా తమ పార్టీకి చెందిన కొందరు నేతలు గాడ్సే ను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా వారిని తాను జీవితంలో క్షమించలేనని ప్రకటించి...జాతిపిత పట్ల తనకున్న గౌరవాన్ని చాటడమే కాకుండా దేశ అభ్యున్నతికి గాంధీ ఆశయాల ఆచరణే శిరోధార్యమని విస్పష్టంగా ప్రకటించారు.నిత్యం గాంధీ పేరు జపించే పార్టీల కంటే...కమలం పార్టీయే గాంధీజీ సిద్ధాంతాలు, ఆశయాలను ఆచరణలో చూపిస్తున్నదని ప్రజలు భావించేందుకు దోహదపడేలా  కార్యక్రమాలను, కార్యాచరణను రూపొందించిన బీజేపీ అగ్రనాయకత్వం గాంధీజీ 150వ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఆ కార్యక్రమాలన్నీ గాంధీజీ ఆశయాల ప్రచారమే లక్ష్యంగా, వాటి అమలుకు బీజేపీ కట్టుబడి ఉన్నదని చాటడమే ధ్యేయంగా రూపిందించింది.

No comments:

Post a Comment