Breaking News

23/10/2019

అదుకునే ఆవు (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, అక్టోబర్ 23 (way2newstv.com):
 అన్నదాతల కుటుంబాలకు ఆసరా లభించనుంది. వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఉన్నతాధికారులు భావించారు. వీరితో పాటు అత్యంత పేదరికం అనుభవిస్తున్న తోటి, కొలాం గిరిజనులకు జీవనోపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని నిర్ణయించారు. బుధవారం జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులకు పశుసంవర్ధకశాఖ అధికారులు మేలు రకం అవులను అందించారు. పాల ఉత్పత్తి ద్వారా ఆర్థికాభివృధ్ధి సాధించేందుకు జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది.జిల్లాలో అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు నష్టపోయి అప్పుల బాధ భరించలేక కొందరు రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టారు. ఇంటి పెద్దదిక్కు కోల్పోయి ఎటూపాలుపోని స్థితిలో ఉన్న కుటుంబాలను ఆదుకోవాలని అధికారులు భావించారు. 
అదుకునే ఆవు (ఆదిలాబాద్)

వ్యవసాయంతోపాటు వారికి పాడి సంపద కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అధికారులు ఈ మేలు రకం ఆవుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఫిర్యాదుల విభాగంలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా..ప్రత్యేకంగా గ్రామాల్లో ఉండే కిసాన్‌ మిత్రల ద్వారా ఆయా రైతుల సమాచారం సేకరించారు. వారు అందించిన వివరాల ఆధారంగా రైతుల ఎంపిక చేపట్టారు. ఇలా జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 33 కుటుంబాలను గుర్తించారు. ఇందులో 20 ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలు కాగా.. మరో 13వరకు వివిధ కారణాలతో నష్టపోయిన కుటుంబాలున్నాయి. వారికి ఒక్కో ఆవును అందించారు. త్వరలో మరికొందరికి కూడా వీటిని అందించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లాలో మిలటరీ డెయిరీ ఫారం నుంచి సుమారు 250కి పైగా ఆవులను తెప్పించారు. ప్రస్తుతం బెల్గాంలో డెయిరీ ఫాంను ఎత్తివేయడంతో కేవలం రూ.వెయ్యి ఒకటి చొప్పున మాత్రమే వాటిని అందించారు. జిల్లా పాలనాధికారి ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా నిధుల నుంచి వీటిని కొనుగోలు చేసి జిల్లాకు తెప్పించారు. మంగళవారమే కొన్ని ఆవులు ఎంపిక చేసిన గ్రామాలకు చేరుకోగా.. బుధవారం మరికొన్ని వచ్చాయి. త్వరలో ఇంకొన్ని కూడా వస్తాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. తాజాగా అందజేసిన ఆవులకు బీమా, రవాణఖర్చులు జిల్లా యంత్రాంగమే భరించింది. ప్రస్తుతం అందించిన ఆవులకు పెట్టేందుకు నెల రోజులకు సరిపడా దాణాను అందించారు. ఒక్కో ఆవు రోజుకు పది లీటర్లకు పైగా పాలు ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఆర్థికంగా అత్యంత వెనుకబడిన ఆదివాసీలకు జీవనోపాధి కల్పించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. వీరిలో తోటి, కొలాం తెగకు చెందిన ఆదివాసీ గ్రామాల్లో డెయిరీ ఫాంలు పెట్టి పాల ఉత్పత్తిని చేపట్టాలని భావించారు. ఇందుకు తొలుత ఐయిదు గ్రామాలను ఎంపిక చేశారు. బీర్సాయిపేట పంచాయతీ పరిధిలోని కొలాంగూడ, ఉట్నూర్‌ పంచాయతీ పరిధిలోని రాంగూడ, వాఘాపూర్‌, జున్నపాని, సకినాపూర్‌ పరిధిలోని నడింపల్లి గ్రామాల్లో డెయిరీ ఫాంలు ఏర్పాటు చేయనున్నారు. ఐటీడీఏలోని సీసీడీపీ నిధుల ద్వారా వీటిని ఏర్పాటుచేయనున్నారు. వీటిలో ఒక్కో గ్రామానికి సుమారు 32వరకు ఆవులను అందించి అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ డెయిరీఫాంలో రోజుకు 150లీటర్ల వరకు పాలను ఉత్పత్తి చేయనున్నారు. విజయ డెయిరీ ద్వారా ప్రతిరోజు ఇక్కడ్నుంచి పాలను తీసుకెళ్లేలా ఒప్పందం చేసుకోనున్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయం ఆయా గ్రామస్థుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడనుంది.

No comments:

Post a Comment