Breaking News

12/08/2019

పదేళ్ల తర్వాత నిండుకుండలా సాగర్

నల్గొండ, ఆగస్టు 12  (way2newstv.in):
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో కృష్ణానది ఉగ్రరూపంతో దాల్చింది. శ్రీశైలం, జురాల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. ఆదివారం శ్రీశైలంలో 10 గేట్లను ఎత్తి నీటిని, నాగార్జున సాగర్‌లోకి వదిలారు. నిన్నటి నుంచి భారీ ప్రవాహం సాగర్‌లోకి భారీగా వరద నీరు చేరి, సాగర్‌ జలకళ సంతరించుకుంది. దీంతో సోమవారం ఉదయం అధికారులు సాగర్‌లోని 24 గేట్లను ఎత్తి, దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. సాగర్ డ్యాం సమీపంలో పూజలు నిర్వహించి 24 గేట్లను, 5 మీటర్ల మేర ఎత్తారు. ప్రస్తుతం సాగర్‌కు ఇన్ ఫ్లో సుమారు 9.50 లక్షల క్యూసెక్కుల నీరు ఉండగా, అవుట్ ఫ్లో సుమారు లక్ష క్యూసెక్కులుగా ఉంది. ఇంకా వరద ఉధృతి ఇలాగే కొనసాగితో మొత్తం 26 గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 
పదేళ్ల తర్వాత నిండుకుండలా సాగర్ 

నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు. శ్రీశైలం నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ప్రస్తుతం సాగర్‌లో నీటి నిల్వ 235 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 564 అడుగులకు చేరింది. గతేడాది సెప్టెంబరు నెలలో పులిచింతలకు నీటిని విడుదల చేయగా.. ఈసారి ఆగస్టు రెండో వారంలోనే నీటిని విడుదల చేయడం గమనార్హం. గతేడాది నాలుగు గేట్లు మాత్రమే ఎత్తి, కేవలం గంట సేపు మాత్రమే దిగువకు నీటిని విడుదల చేశారు. గత పదేళ్ల నుంచి సాగర్‌లో 24 గేట్లు తెరుచుకోవడం ఇదే తొలిసారి. 2009లో అప్పటి వరద ఉధృతికి 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ నుంచి విడుదల చేసిన నీరు పులిచింతల ప్రాజెక్టులోకి పరుగులు తీస్తోంది. దీంతో కేవలం 44 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉన్న పులిచింతల ప్రాజెక్టు ఒక్క రోజులో నిండే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీకి విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.నాగార్జునసాగర్‌ నిండుకుండలా, జలకళ సంతరించుకోవడంతో పర్యాటకలను ఆకర్షిస్తోంది. వరుస సెలవుల నేపథ్యంలో పెద్ద ఎత్తున సందర్శకులు సాగర్ చేరుకున్నారు. కృష్ణమ్మ పరుగులను చూసేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రాజెక్టు అందాలను తనివీ తీరా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సాగర్‌కు వరద ఇలాగే పెరిగితే, రానున్న వారం రోజుల్లో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సందర్శకుల తాకిడి నేపథ్యంలో అధికారులు సాగర్ వద్ద భద్రతను పటిష్టం చేశారు

No comments:

Post a Comment