Breaking News

12/08/2019

13 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పైవిజయశాంతి..

హైద్రాబాద్, ఆగస్టు 12 (way2newstv.in - Swamy Naidu):
లేడీ సూపర్ స్టార్‌గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసుకున్న నటి విజయశాంతి. ఓ వైపు హీరోయిన్‌గా స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు ‘కర్తవ్యం’ లాంటి పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. విజయశాంతి చివరిగా ‘నాయుడమ్మ’ సినిమాలో నటించారు. 2006లో ఈ సినిమా విడుదలైంది. ఆ తరవాత విజయశాంతి తన సమయాన్ని మొత్తం రాజకీయాలకు కేటాయించేశారు. ఎంపీగా పనిచేశారు. ఇన్ని రోజులూ ప్రజాసేవకు అంకితమైన విజయశాంతి ఇప్పుడు మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ముఖ్య పాత్ర చేయడానికి విజయశాంతి అంగీకరించిన సంగతి తెలిసిందే. 
13 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పైవిజయశాంతి..
13 ఏళ్ల తరవాత ఆమె మళ్లీ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు. ఈ విషయాన్ని సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు. అయితే, ఆమె తాజాగా షూటింగ్‌లో పాల్గొన్నట్లు అనిల్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ట్వీట్ చేశారు. 13 ఏళ్ల తరవాత విజయశాంతి గారు మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఈ 13 ఏళ్లలో ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. అదే క్రమశిక్షణ, అదే సత్‌ప్రవర్తన, అదే డైనమిజం. విజయశాంతి గారికి స్వాగతం’’ అని అనిల్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ కశ్మీర్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబుతో పాటు విజయశాంతి కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీఎంబీ (జి మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్), ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర నిర్మాతలు. 

No comments:

Post a Comment