Breaking News

08/07/2019

నర్సరీలకు వాన గండం....

పాలమూరు, జూలై 8, (way2newstv.in)

అటవీశాఖ అధికారుల్లో గుబులు మొదలైంది.. గతేడాది తరహా ఈసారీ వర్షాలు ఊరిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్‌ చివరి వారంలో వర్షాలు ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేశారు. కాని అనూహ్యంగా జులైలో అయిదురోజులు గడిచినా వర్షాలు లేకపోవడంతో ఆందోళన మొదలైంది. ఇప్పటికే వర్షాలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికి ఇప్పటి వరకు రాలేదని అధికారులు చెబుతున్నారు. నాలుగు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితులు ఉండటంతో అధికారులు ఏమీ చేయాలని పునరాలోచనలో పడ్డారు. రెండో వారంలో వర్షాలు వస్తాయని అధికారులు భావిస్తుండటంతో అప్పటి వరకు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ఒకవేళ రెండో వారంలో వర్షాలు పడినప్పటికి ఒకటి రెండు రోజులు వేచి చూసి తరవాత మొక్కలు నాటాలా? లేదా? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.జులై మొదటి వారం నుంచి కార్యక్రమం నిర్వహించాలని అధికారులు భావించినప్పటికి వర్షాలు లేకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు..జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉండటంతో అధికారుల్లో సైతం ఆందోళన నెలకొంది. 

నర్సరీలకు వాన గండం....

ఇప్పటికే వర్షాలు ప్రారంభం కావాల్సి ఉన్నా పూర్తిస్థాయిలో పడటం లేదు. కొద్ది నిమిషాలు తేలికపాటి వర్షం కురిసి ఆగిపోతోంది. దీంతో మొక్కలు పెంచేందుకు అనువుగా వర్షాలు పడటం లేదని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే గతేడాది వర్షాలు లేక కోటిన్నర మొక్కలు నర్సరీలకు పరిమితమయ్యాయి. ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే 96 లక్షల మొక్కలు నర్సరీల్లో ఉన్నాయి. ఇప్పటికే బాగా ఎత్తుకు మొక్కలు పెరిగాయి. ఈసారి మళ్లీ నర్సరీల్లోనే మొక్కలు ఉంటే మాత్రం కచ్చితంగా ప్రస్తుతం బ్యాగుల్లో ఉన్న మొక్కలను మార్పు చేయాల్సి ఉంటుంది. మరో ఏడాది పాటు ఈ మొక్కలను పెంచడం సమస్యగా మారుతుంది. ప్రస్తుతం నర్సరీల్లో నీటి సమస్యలు సైతం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నర్సరీల నిర్వహణ సైతం భారంగా మారుతుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. గతేడాది వర్షాలు లేక మొక్కలు నర్సరీలకు పరిమితం అయ్యాయి.. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఈ ఏడాది కూడా వర్షాలు లేకపోతే ఇబ్బందులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.. రెండో వారం నుంచి వర్షాలు వస్తాయనే సూచనలు ఉన్నప్పటికి పూర్తిస్థాయిలో వర్షాలు పడితే తప్ప మొక్కలు నాటకూడదని అధికారులు భావిస్తున్నారు.. లేకపోతే నాటిన మొక్కలు బతికేందుకు అవకాశం ఉండదని అధికారులు ఆందోళన చెందుతున్నారు..ఒకవేళ వర్షాలు పడుతున్నాయని వేగంగా మొక్కలు నాటితే తరవాత వర్షాలు పడకపోతే నాటిన మొక్కలు చనిపోతాయని అధికారులు ఆందోళనలో ఉన్నారు.జిల్లాలో ఈ ఏడాది హరితహారం కార్యక్రమంలో 4.56 కోట్ల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే అత్యధికంగా మొక్కలు నాటేందుకు నిర్ణయం తీసుకున్నారు. వనపర్తి జిల్లాలో మొక్కలు నాటేందుకు స్థలాలు లేకపోవడంతో లక్ష్యాన్ని తగ్గించుకున్నారు. అయితే జిల్లాలో ఉపాధిహామీ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటే ప్రక్రియను నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొక్కలు నాటడం మొదలు సంరక్షణ వరకు ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు చెల్లించేందుకు నిర్ణయించారు. ఎక్కువ మొక్కలు నాటిన కార్యాలయాలు, ప్రాంతాల్లో ఉపాధిహామీ ద్వారా డబ్బులు కూలీలు ఏర్పాటు చేసి వాటికి నీరు పోయడంతోపాటు సంరక్షణ చేసేందుకు బాధ్యతలు ఇవ్వనున్నారు. మిగతా జిల్లాల్లో సైతం ఉపాధిహామీ పథకం కింద మొక్కలు నాటే ప్రక్రియ చేస్తున్నారు. కేవలం నాటడం వరకే పథకం ద్వారా చేస్తున్నప్పటికి సంరక్షణ బాధ్యతలను మాత్రం ఆయా సంస్థలు మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment