Breaking News

27/07/2019

టీడీపీకి కాపు కాస్తారా

ఏలూరు, జూలై27, (way2newstv.in)
ఎన్నికలు ముగిసి ఊహించని పరాజయం పలకరించాకా టిడిపి కాపు నేతల్లో జరుగుతున్న ఆందోళన ఇంతా అంతా కాదు. తూర్పుగోదావరి జిల్లాలో మొదలైన కాపు నేతల ఆందోళన పశ్చిమ గోదావరి జిల్లాకు పాకింది. తమ పార్టీకి కాపులు దూరం అయినట్లేనా అన్నదే ఇప్పుడు వీరి సమీక్షల్లో ప్రధాన అంశం. జనసేన ఉన్నంత కాలం టిడిపిలో ఉన్నా ప్రయోజనం లేదన్న అభిప్రాయం వారిలో వ్యక్తం అయినట్లు ప్రచారం సాగుతుంది. 2014 ఎన్నికల్లో జనసేన కలిసి ఉండటంతో ఆ ఓటు బ్యాంక్ కలిసొచ్చి విజయం అందుకోగలిగామని వారి అంతర్గత చర్చల్లో తేల్చారంటున్నారు. పవన్ ను దూరం చేసుకుంటే తమ రాజకీయ జీవితం ముగిసినట్లేనని అధినేత ముందు ప్రస్తావించేందుకు సిద్ధం అవుతున్నట్లు టాక్.
టీడీపీకి కాపు కాస్తారా

టిడిపి లోని కాపు నేతలను ఆకర్షించేందుకు మరోవైపు కమలం కాచుకుని కూర్చుని వుంది. ఇప్పటికే కన్నా లక్ష్మి నారాయణ సారధ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా నడుస్తుంది. ఇంకోపక్క బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పార్టీలోకి వచ్చే వారికి పదవుల అంశంలో భరోసా కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. మరో పాతికేళ్ళు బిజెపికి తిరుగులేదనే స్లోగన్ తో సైకిల్ టీం మొత్తాన్ని ఖాళీ చేయించే ప్రయత్నంలో ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తున్నారు.ప్రస్తుతం ఓటమి చెందిన వారు టిడిపి రాజకీయ భవిష్యత్తు పై ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ప్రతినిధులుగా ఉన్నవారిలో పార్టీపై చింత పెరిగిపోతుంది. ఏ పార్టీ బెటర్ అన్న ఆలోచనలోనే వారి చర్చలు నడుస్తున్నట్లు పసుపు సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. వైసిపి అధికారంలో ఉండగా ఐదేళ్ళు నియోజకవర్గాల్లో పార్టీని మోయడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు. ముఖ్యంగా అనేకమంది వ్యాపార కార్యకలాపాలు తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినవారు కావడంతో అటు కేంద్రం లేదా ఇటు రాష్ట్రంలోని అధికార పార్టీలో ఉంటేనే బండి నడుస్తోందన్న లెక్కల్లో వున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఈ బ్యాచ్ టిడిపి కొంప నిండా ముంచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏమి జరగనున్నదో.

No comments:

Post a Comment