Breaking News

20/07/2019

గ్రామాల్లో జోరుగా నాటు సారా తయారీ

అనంతపురం, జూలై 20, (way2newstv.in
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను మద్యం మత్తు నుంచి దూరం చేయాలని గ్రామాల్లో బెల్టు షాపులను రద్దు చేసింది. అయితే నాటుసారా తయారీదారులు పేదల బతుకుల్లో కుంపటి పెడుతున్నారు. బెల్టు షాపుల రద్దు తర్వాత గ్రామాల్లో నాటు సారాయి తయారీ, అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. రాష్ట్రానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మద్యం మహమ్మారి నుంచి ప్రజలను కాపాడి, వారిని ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్య నిషేధాన్ని విడతల వారీగా అమలు చేయాలని చూస్తున్నారు.  కుళ్లిన పండ్లు, వ్యర్థ పదార్థాలతో ఈ నాటుసారా తయారు చేస్తుండటంతో ఇది చాలా మత్తుగా ఉండటంతో పాటు విష పూరితంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. 
గ్రామాల్లో జోరుగా నాటు సారా తయారీ

ఈ నాటుసారా తయారీలో ఎక్కువగా కుళ్లిన అరటి పండ్లు, చెడిపోయిన బెల్లం, యూరియా వంటి పదార్థాలు వినియోగిస్తారు. దీనిని తయారు చేసేందుకు రూ.20(లీటర్‌కు) ఖర్చు వస్తే, తర్వాతా దీనిని రూ.100 లకు విక్రయిస్తూ తయారీదారులు మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అయితే దీనిని తాగేవారు మాత్రం ఆర్థికంగా నష్టపోవటంతో పాటు వారి ఆరోగ్యాలను కూడా పాడు చేసుకొంటున్నారు. బద్దలాపురంలో నాటుసారా ఎక్కువగా సేవించి ఆరోగ్యాలు పాడుచేసుకొని కొందరు ప్రాణాలను కూడా పొగొట్టుకొంటున్నారని గ్రామంలోని మహిళలు వాపోయారు.  మండలంలో పలుచోట్ల నాటుసారా తయారీ, విక్రయాలు కొనసాగుతున్నా, దీనిని నివారించవలసిన ఎక్సైజ్‌ అధికారులు మండలంలో ఎక్కడా దాడులు చేయటం లేదు. దీంతో బద్దలాపురం, వేపకుంట, తూంచర్ల, పాతపాళ్యం వంటి గ్రామాల్లో విచ్చలవిడిగా నాటుసారా తయారీ, విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఇక గ్రామాల్లో సాధారణ పోలీస్‌ సిబ్బంది కూడా కేవలం మద్యం బెల్టు షాపులపై మాత్రం దాడులు చేసి, నాటు సారా విక్రయాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించి నాటుసారా మహమ్మారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.  మద్యపానంతో గ్రామాల్లో చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ప్రభుత్వం గ్రామాల్లో బెల్టు షాపులను రద్దు చేయించినా కొన్ని గ్రామాల్లో నాటుసారా తయారీ చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు. దీనివల్ల ప్రజలు ఆర్థికంగా దెబ్బతినటంతో పాటు అనారోగ్యం పాలవుతున్నారు. బద్దలాపురంలోనే నాటుసారాకు అలవాటు పడి చాలా మంది అనారోగ్యాల పాలై ప్రాణాలు కూడా పోగొట్టుకొన్నారు.  ఎక్సైజ్‌ అధికారులు గ్రామాల్లో విసృతంగా తనిఖీలు చేసి నాటుసారా తయారీని అరికట్టాలి

No comments:

Post a Comment