Breaking News

22/07/2019

ఆటో డ్రైవర్ నిజాయితీ

విజయవాడ, జూలై 22 (way2newstv.in)
తన ఆటోలో ఎక్కిన ప్రయాణీకుడు మరిచిపోయిన రూ.2.15 లక్షల నగదును అతడికి తిరిగి అప్పగించి ఓ ఆటోవాలా తన నిజాయితీని చాటుకున్నాడు. ఈ ఘటన విజయవాడ వన్‌టౌన్‌ పోలీసు స్టేషను పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా నగరికి చెందిన కోదండరామ్‌ తన కుమార్తె నిహారిక ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ కోసం ఆదివారం విజయవాడ వచ్చారు. గవర్నరుపేటలోని ఓ లాడ్జిలో దిగిన ఇద్దరూ కనకదుర్గమ్మను దర్శించుకోడానికి ఆటోలో వెళ్లారు. అమ్మవారిని దర్శనం చేసుకోవాలనే హడావుడిలో బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయారు. 
ఆటో డ్రైవర్ నిజాయితీ

దర్శనం అనంతరం బ్యాగు కనిపించక పోవడంతో ఆటోలో మరిచిపోయిన విషయం గుర్తించిన బాధితుడు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. అయితే వారు ఎక్కిన ఆటో నెంబరు తెలియకపోవడంతో గందరగోళం నెలకుంది. దీంతో ఆటో ప్రయాణించిన మార్గంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. కోదండరామ్ ఎక్కిన ఆటో వెనక ఆత్మబంధువు అని రాసున్న పోస్టర్ కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు ఆ ఆటో ఆచూకీ కోసం ఆరా తీశారు. ఆటో డ్రైవరు వడ్డాది వెంకటేష్‌ ఇంటికి వెళ్లిన తరువాత ఆటోలో ఓ బ్యాగు ఉన్న విషయం గమనించారు. దాన్ని తెరిచి చూడగా నగదుతోపాటు సర్టిఫికెట్లు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే మరికొందరు ఆటో డ్రైవర్లతో కలిసి ఆ బ్యాగు తీసుకుని వన్‌టౌన్‌ పోలీస్టేషన్‌కు వచ్చాడు. బ్యాగు పోగొట్టుకున్న బాధితులు ఈ విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. వన్‌టౌన్‌ సీఐ కాశీవిశ్వనాథ్‌ సమక్షంలో వెంకటేశ్ ఆ బ్యాగును కోదండరామ్‌కి అప్పగించాడు. తనది కాని సొమ్మును తిరిగిచ్చి నిజాయితీ చాటుకున్న వెంకటేష్‌ను పోలీసు అధికారులు అభినందించారు. అలాగే నగదు రివార్డు కూడా అందజేశారు. 

No comments:

Post a Comment