Breaking News

07/06/2019

గవర్నర్ తో చంద్రబాబు భేటీ


హైద్రాబాద్, జూన్ 7 (way2newstv.in)
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నర్‌తో చంద్రబాబు ఆకస్మిక భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్‌ను చంద్రబాబు కలవడం వెనుక కారణం ఏంటనే చర్చ తీవ్రంగా సాగుతోంది. 


గవర్నర్ తో చంద్రబాబు భేటీ
అయితే, టీడీపీ వర్గాలు మాత్రం దీనిపై భిన్నంగా స్పందించాయి. ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన చంద్రబాబు నాయుడు తన లేఖను గవర్నర్‌కు వ్యక్తిగతంగా కాకుండా ఫ్యాక్స్ ద్వారా పంపారు కాబట్టి ప్రస్తుతం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. టీడీపీ వర్గాలు చెబుతున్నట్టు గవర్నర్‌ను బాబు మర్యాదపూర్వకంగా కలిశారా? మరేదైనా కారణం ఉందా? అనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఆదివారం వరకు చంద్రబాబు హైదరాబాద్‌లోనే ఉంటారు. శుక్ర, శనివారాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి, ఆదివారం కుటుంబంతో గడిపి తిరిగి సోమవారం అమరావతికి చేరుకుంటారు. జూన్ 12 నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ శాసనసభాపక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించనున్నారు. టీడీపీ కోర్ కమిటీ సమావేశం సోమవారం సాయంత్రం జరగనుండగా, 14న పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment