Breaking News

28/06/2019

హిందుత్వ అజెండాతో జగన్, కేసీఆర్


బీజేపీకి  బ్యాలెన్స్ చేసే పనిలో సీఎంలు
హైద్రాబాద్, జూన్ 28 (way2newstv.in)
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా పీఠాలకూ, స్వాములకూ విలువ పెరిగిపోతోంది. ఇది మోడీ ఎఫెక్ట్ గా భావిస్తున్నారు. ఉత్తరాదిని జయించిన మోడీ, షా ద్వయం చూపు ఇపుడు దక్షిణాది మీద పడింది. దక్షిణాదిలో కర్నాటక తప్ప ఎక్కడా బీజేపీ విస్తరించలేకపోయింది. కేరళ, తమిళనాడు ఇప్పట్లో కొరుకుడుపడేలా లేవు కానీ, తెలంగాణాలో ఆంధ్ర ప్రదేశ్ లలో బలం పుంజుకునేందుకు కమలానికి దారులు కనిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా నాలుగు సీట్లు గెలుచుకున్న బీజేపీ తెలుగు రాష్ట్రాలలో ఎంట్రీకి తెలంగాణాను గేట్ వేగా చేసుకోవాలనుకుంటోంది.కమలం పువ్వుకు ముల్లుతోనే చెక్ పెట్టాలని తెలంగాణా సీం కేసీయార్ నిర్ణయించారు. 

హిందుత్వ అజెండాతో జగన్, కేసీఆర్

హిందుత్వ కార్డు తో తెలంగాణాలో పాతుకుపోవాలని చూస్తున్న బీజేపీకి అదే హిందూత్వ కార్డుతో ఝ‌లక్ ఇవ్వాలన్నది కేసీయార్ ప్లాన్. అందుకే విశాఖ శారదాపీఠం స్వామీజీ ఆసరాను ఆయన తీసుకుంటున్నారు. స్వామితో సాన్నిహిత్యాన్ని రాజకీయంగా వాడుకోవడం ద్వారా హిందువుల మనసు గెలుచుకోవాలని, మెజారిటీ ఓట్లను గంపగుత్తగా పట్టేయాలని ఆలొచన చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంక్ కోసం కేసీయార్ ప్రయోగాలు చేయడంతో హిందువులు బీజేపీ వైపు మళ్ళారు. ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఇపుడు ఇటు వైపు దువ్వుడు కార్యక్రమాన్ని కేసీయార్ మొదలుపెట్టారు. మజ్లిస్ పార్టీతో దోస్తీ తగ్గించి స్వాములతో పీఠాలతో కేసీయార్ గడుపుతున్నారు.ఇక ఏపీ సీఎం జగన్ విషయంలో బీజేపీ సులువుగా హిందుత్వ కార్డ్ ప్రయోగించే అవకాశాలు ఉన్నాయన్నది తెలిసిందే. క్రిస్టియన్ మతాన్ని నమ్మే జగన్ కి వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టడం బీజేపీకి సులువైన పని. అయితే జగన్ కూడా రాటుతేలిన రాజకీయమే చేస్తున్నారు. తనకు మొదటి నుంచి ఉన్న ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ ఓటు బ్యాంక్ ని కాపాడుకుంటూనే కొత్తగా బీసీలను దగ్గరకు తీస్తున్నారు. దాంతో పాటుగా అగ్ర కులాల మద్దతు కోసం స్వాములను, గుళ్ళను ఆయన కూడా నమ్ముకున్నారు. కేసీయార్ బాటలోనే జగన్ సైతం శారదాపీఠం స్వరూపానందేంద్ర ఆశీస్సులు కోరుకుంటున్నారు. తద్వారా హిందువుల మనసు గెలుచుకోవాలని. బీజేపీని నిలువరించాలని జగన్ తాపత్రయం. చూడాలి మరి ఏం జరుగుతుందో.

No comments:

Post a Comment