Breaking News

18/06/2019

చంద్రబాబు విదేశీ పర్యటనల ఖర్చు.. లెక్కలు చూపించిన విజయసాయి


అమరావతి, జూన్ 18 (way2newstv.in)
నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరవాత విదేశీ పర్యటనలకు ఆయన చేసిన కొన్ని ఖర్చులను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బయటపెట్టారు. నవంబర్ 2014 నుంచి ఏప్రిల్ 2016 వరకు చంద్రబాబు చేసిన విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చుల వివరాలను ప్రధాన పరిపాలన శాఖ వెల్లడించినట్లు చూపుతోన్న పత్రాన్ని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఈ పత్రంలో ఉన్న లెక్కల ప్రకారం నాలుగు దేశాల పర్యటనకు గాను చంద్రబాబు సుమారు రూ.8.33 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు.  


చంద్రబాబు విదేశీ పర్యటనల ఖర్చు.. లెక్కలు చూపించిన విజయసాయి
ఈ లెక్కల గురించి విజయసాయి ట్వీట్ చేస్తూ.. ‘చంద్రబాబు విదేశీ టూర్ల ఖర్చుకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఒక పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొదటి ఆరు నెలల్లో సారు నెల రోజులు విదేశాల్లోనే గడిపారు. మందీ మార్బలాన్ని వెంటేసుకుని సింగపూర్, చైనా, స్విట్జర్లాండ్, జపాన్ సందర్శించారు. ఏం సాధించారో ఎక్కడా కనిపించదు’ అని పేర్కొన్నారు. ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా పలు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇక వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరవాత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విజయసాయి మరిన్ని ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. చంద్రబాబు వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఎండగడుతున్నారు. 

No comments:

Post a Comment