Breaking News

07/06/2019

ధోని గ్లౌవ్స్ పై వెనక్కి తగ్గిన ఐసీసీ


లండన్, జూన్ 7, (way2newstv.in)
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ 2019లో వివాదాస్పదంగా మారిన ధోనీ వికెట్ కీపింగ్ గ్లౌవ్స్‌పై ఉన్న గుర్తు విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. భారత ఆర్మీ లెప్టినెంట్ కల్నల్ (గౌరవ) హోదాలో ఉన్న ధోనీ.. పారా మిలటరీకి బలగాలకి చెందిన ‘బలిదాన్’ గుర్తుని తన గ్లౌవ్స్‌పై వేయించుకుని ఇటీవల దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కీపింగ్ చేశాడు. దీంతో.. అతని దేశభక్తిని కీర్తిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో కొనియాడగా.. వెంటనే ఆ గుర్తుని ధోనీ గ్లౌవ్స్‌ నుంచి తొలగింపజేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి  రాత్రి ఐసీసీ సూచన చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌లో జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తుల్ని ఆటగాళ్ల జెర్సీ, కిట్స్‌పై అనుమతించరు.


ధోని గ్లౌవ్స్ పై వెనక్కి తగ్గిన ఐసీసీ
ఐసీసీ సూచన వార్త వెలుగులోకి రాగానే భారత అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. మరోవైపు ధోనీకి మద్దతుగా నిలుస్తూ.. అవసరమైతే ప్రపంచకప్‌ని టీమిండియా బహిష్కరించాలి తప్ప.. గుర్తుని మాత్రం గ్లౌవ్స్‌ నుంచి తొలగించొద్దంటూ సూచనలు చేస్తున్నారు. దీంతో.. వివాదాస్పదంగా మారిన ఈ అంశానికి తెరదించాలని యోచించిన ఐసీసీ.. ఆ గుర్తు ఎలాంటి జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తు కాదని ధోనీ తరఫున బీసీసీఐ స్వయంగా వివరణ ఇచ్చి అనుమతి తీసుకుంటే ప్రపంచకప్‌లో ఆ గ్లౌవ్స్‌ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇటీవల పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత ఆర్మీ క్యాప్‌లు ధరించి టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందే ఐసీసీ నుంచి బీసీసీఐ అనుమతి తీసుకుంది. భారత్‌కి 28 ఏళ్ల తర్వాత 2011‌లో వన్డే ప్రపంచకప్‌ని అందించిన మహేంద్రసింగ్ ధోనీకి భారత ఆర్మీ లెప్టినెంట్ కల్నల్ హోదాతో గౌరవించింది. ఆ తర్వాత ఆగ్రాలో కొన్ని రోజులు ఆర్మీతో కలిసి శిక్షణ తీసుకున్న ధోనీ.. సాహసోపేతంగా ఐదు సార్లు ప్యారాచ్యూట్ డైవ్ కూడా చేశాడు. తనకి ఆర్మీ అంటే ఎంతో ఇష్టమని అప్పట్లో చెప్పుకొచ్చిన ధోనీ.. క్రికెట్‌కి రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఆర్మీతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు.

No comments:

Post a Comment