Breaking News

16/05/2019

ఎండ ధాటికి విలవిలలాడుతున్న పశువులు

కడప, మే 16, (way2newstv.in)
రాజంపేట డివిజన్ పరిధిలో అనేక గ్రామాల్లో మండుతున్న ఎండలకు మేతలేక పశువులు అలమటిస్తున్నాయి. ప్రస్తుతం కాస్తున్న ఎండల తీవ్రత కారణంగా ఎక్కడ చూసినా పంట పొలాలు, పచ్చిక బైర్లల్లో పచ్చిమేత కరవైంది. దీంతో పశువులకు పచ్చి మేత దొరకక పశు యజమానులు అనేక అవస్థలు పడక తప్పడం లేదు. గత ఏడాది వర్షాలు పడిన కారణంగా కొంతవరకు పరిస్థితులు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంత మెరుగ్గా ఉన్నప్పటికి తగ్గిపోతున్న భూగర్భనీటి నిల్వలతో ఆందోళన రైతుల్లో కనిపిస్తుంది. చెరువుల్లో, కుంటల్లో, మడుగుల్లో కూడా నీటినిల్వలు పడిపోతున్నాయి. ఈ కారణంగా భూమిలోని తేమ ఇంకిపోతూ పశువులకు పచ్చి మేత ఎండిపోతుంది. దీంతో పశువులను మేత కోసం పలు గ్రామాల్లో సుదూరంగా పాడి పశువుల యజమానులు తీసుకెళ్ళాల్సి వస్తుంది. 


ఎండ ధాటికి విలవిలలాడుతున్న పశువులు 

పచ్చి మేత కోసం కొన్ని గ్రామాల్లో కిలోమీటర్ నుండి రెండు కిలోమీటర్ల వరకు పశువులను తొలుకువెళ్లి కుంటలు, వాగులు, వంకల్లో పశువులను మేపక తప్పనిసరి పరిస్థితిలు ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా పశువులు ఎండ వేడిమికి తాళలేక పోతున్నాయి. దీంతో పాడి పశువుల రైతులు ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పాడి పశువులకు పచ్చి మేత తగ్గిపోవడంతో పాల దిగుబడి కూడా అంతంత మాత్రమే ఇస్తూ పాల శాతం గణనీయంగా పడిపోయిందని పాడి పశువుల రైతులు వాపోతున్నారు. పశువుల పచ్చి మేత కోసం బోరు బావుల కింద గడ్డి గింజలతో పచ్చి పశుగ్రాసాన్ని సాగు చేస్తూ కొంత మేర పాడి పశువులకు పచ్చి మేతను అందిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి పచ్చికబైర్లు పచ్చబడతాయనే ఆశతో రైతులు ఉన్నారు. అలాగే ఇంకొకమారు భారీవర్షం కురిస్తే కనీసం పశువులకు పచ్చిక బైర్లు పచ్చబడి మేతైన దొరుకుతుందని రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎదేమైనా ఈ మండుతున్న ఎండలకు పశువులు ఎండ వేడిమికి మేతలేక అలమతిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. పశు సంవర్ధకశాఖ అధికార్లు పాడి పశువులు పచ్చిమేత దొరకక పడుతున్న అవస్థలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరముంది. ఇందుకోసం పచ్చిమేత లభించని అనేక గ్రామాల్లో దుస్థితిపై నివేదికలు కూడా సేకరించడం ద్వారా తదనుగుణంగా చర్యలు గైకొనేందుకు వీలవుతుంది. ఇప్పటికే పచ్చిమేత దొరకక పాల ఉత్పత్తులు పడిపోతే పాడి పశువుల యజమానులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ఎండల తీవ్రత పెరిగే అవకాశాలున్నందున పశు సంవర్ధకశాఖ తగు చర్యలు వెంటనే చేపట్టాల్సిన అవసరముంది.

No comments:

Post a Comment