Breaking News

04/04/2019

బీఎస్ఎన్ ఎల్ లో పదవీ విరమణ వయస్సు తగ్గింపు

ముంబై, ఏప్రిల్ 4(way2newstv.in)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌) తన ఉద్యోగులకు షాకిచ్చింది. ఏకంగా 54 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సన్నద్దమవుతోంది. ఈ మేరకు ఉద్యోగుల తొలిగింపునకు సంబంధించిన ప్రతిపాదనకు బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా పదవీ విరమణ వయసును 58 సంవత్సరాలకు తగ్గించింది. మార్చి నెలలో నిర్వహించిన బోర్డు సమావేశంలో ఈ మేరకు సంస్థ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు మొత్తం పది ప్రతిపాదనలను సూచించగా.. అందులో మూడింటికి బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. 


బీఎస్ఎన్ ఎల్ లో పదవీ విరమణ వయస్సు తగ్గింపు

ఎన్నికల అనంతరం దీనిపై తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనల్లో ముఖ్యంగా పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకు తగ్గించింది. అలాగే 50 సంవత్సరాల పైబడిన ఉద్యోగులందరినీ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) కింద ఇంటికి పంపించడం. దీంతో మొత్తం ఉద్యోగుల్లో 31 శాతం అంటే సుమారు 54,451 మంది ప్రభావితం కానున్నారు. ప్రస్తుతం సంస్థలో మొత్తం 1.76 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక మూడో ప్రతిపాదన 4జీ స్పెక్ట్రం కేటాయింపునకు సంబంధించింది. 
తీవ్ర నష్టాలతో కునారిల్లిన సంస్థ తొలిసారి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి దిగజారిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులకు జీతాల కోసం ప్రత్యేకంగా రూ.5 వేల కోట్ల అప్పు కూడా చేయాల్సి వచ్చింది. దీనికితోడు ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి రావాల్సిన రూ.2900 కోట్లు చెల్లించడంతోపాటు మరో రూ.3500 కోట్ల రుణం కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం ఇచ్చింది. ఈ డబ్బుతో మరో మూడు, నాలుగు నెలల వరకు బీఎస్‌ఎన్‌ఎల్ తన కార్యకలాపాలను కొనసాగించే వీలు కలిగింది. మరో రూ.700 కోట్లు కూడా రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి రావాల్సి ఉంది. 

No comments:

Post a Comment