Breaking News

03/04/2019

ఒక్కటవుతున్న శాశ్వత శత్రువులు

అనంతపురం,తిరుపతి ఏప్రిల్ 3 (way2newstv.in)
రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు.. శాశ్వత శత్రువులూ ఉండరు. సినిమాల్లో ఈ సామెత తరచూ వాడుతుంటారు. వాస్తవ రాజకీయాల్లో శత్రువులు మిత్రులు కావడం సాధ్యమేనా అంటే నో ఛాన్స్. అందులో పౌరుషాల పురిటగడ్డ రాయలసీమలో శత్రువులు భుజాలపై చేతులేసుకొని.. దోస్త్ మేరా దోస్త్ పాట పాడుకోగలరా అంటే సమస్యే లేదు. సీన్ కట్ చేస్తే.. ఇదంతా ఒకప్పటి మాట.. కాలం మారింది.. నేతల మధ్య పగలు, ప్రతీకారాలను చెరపేసింది. ఫ్యాక్షన్ హత్యలకు దూరంగా.. పాత పగల్ని మర్చిపోయి ఐక్యతా రాగం పాడుతున్నారు. సొంత ఎజెండాలను పక్కన పెట్టి.. పార్టీ జెండాలను ఎగరేసేందుకు నడుం కట్టారు టీడీపీ నేతలు. ఒకరికొకరు సహకరించుకుంటూ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర విభజన జరిగింది.. 2014 ఎన్నికలు ముంచుకొచ్చాయి. అప్పుడే పరిటాల ప్రత్యర్థి వర్గం జేసీ సోదరులు టీడీపీగూటికి చేరారు. అప్పుడే సరికొత్త రాజకీయం జిల్లాలో మొదలయ్యింది. జేసీ వర్గం రాకను పరిటాల సునీత తీవ్రంగా వ్యతిరేకించారు.. వారితో కలిసి పనిచేసేది లేదని తెగేసి చెప్పారు. ఒకే పార్టీలో ఉంటూ రాజకీయ వేదికను పంచుకున్నా ఎడ మొహం పెడమొహంగా ఉన్నారు. చూస్తూ ఉండగానే 2019 ఎన్నికలు దూసుకొచ్చాయి. నేతల మధ్య కోల్డ్ వార్ మాత్రం కొనసాగుతూనే ఉంది. 
అనంతపురం జిల్లా: జేసీ-పరిటాల 


ఒక్కటవుతున్న శాశ్వత శత్రువులు

రాయలసీమలో అత్యంత కరువు జిల్లాగా ఉంది అనంతపురం. ఈ గడ్డపై ఫ్యాక్షన్ పగలు ఎప్పుడూ భగ్గుమంటూనే ఉన్నాయి. ఇక్కడి నేతలు రెండు వర్గాలుగా విడిపోయి.. హత్యలు, ఘర్షణలతో రక్తం ఏరులై పారేది. ఐదారేళ్ల క్రితం జిల్లాలో జేసీ కుటుంబం వర్సెస్ పరిటాల కుటుంబంగా రాజకీయం సాగేది. రెండు వర్గాల పగలు, ప్రతీకారాలకు ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోగొట్టుకున్నారు. జేసీ కుటుంబం కాంగ్రెస్‌లో.. పరిటాల ఫ్యామిలీ టీడీపీలో కొనసాగాయి. ఈ క్రమంలోనే 2004లో పరిటాల హత్యతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పటి నుంచి కొనసాగిన ఈ ఫ్యాక్షన్ పగలు 2014 వరకు కొనసాగుతూనే వచ్చాయి. పార్టీలో విభేదాలపై దృష్టిపెట్టిన చంద్రబాబు.. నేతల్ని పిలిచి మాట్లాడారు. పాత పగల్ని పక్కన పెట్టి కలిసి పనిచేయాలని తేల్చి చెప్పారు. ఐక్యతగా ముందుకు సాగి జిల్లాలో మెజార్టీ సీట్లు గెలుచుకోవాలని ఓ లక్ష్యాన్ని నిర్దేశించారు. అధినేత మాటతో ఇరు వర్గాలు ఏకతాటిపైకి వచ్చాయి.. ఎన్నికల్లో కలిసి పనిచేస్తున్నాయి. చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటకు వస్తున్న సమయంలో అనంతపురం ఎంపీ అభ్యర్థి జేసీ పవన్‌కుమార్ రెడ్డి.. రాప్తాడు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ వేదిక దగ్గర సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. అధినేత చంద్రబాబుతో కలిసి ఒకే వేదికను కూడా పంచుకున్నారు.
కడప జిల్లా- ఆదినారాయణ రెడ్డి-రామసుబ్బారెడ్డి 
కడప జిల్లా.. ఫ్యాక్షన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా అందరూ చెబుతుంటారు. పది రూపాయల కోసం హత్యలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడి గ్రామాల్లో రెండు వర్గాల మధ్య గొడవ మొదలయ్యిందంటే.. కనీసం ఇద్దరు ముగ్గురి ప్రాణాలైన గాల్లో కలవాల్సిందే. ఇక్కడ తరతరాలుగా.. తాతలు, తండ్రుల ఆస్తుల్లా పగల్ని కూడా వారసత్వంగా భావిస్తుంటారు. ఫ్యాక్షన్ పగలతో నలిగిపోయి.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఫ్యాక్షన్ పేరుతో కొట్టుకు చస్తున్నారు. కడప జిల్లాలో జమ్మలమడుగు పేరు చెబితే గుర్తొచ్చేది దేవగుడి వర్గం వర్సెస్ శివారెడ్డి వర్గం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. రెండు కుటుంబాల మధ్య తరతరాలుగా వైరం నడిచింది. రెండు వర్గాల్లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య చాలానే ఉంది. 2014 ఎన్నికల తర్వాత ఉన్నట్టుండి జమ్మలమడుగు రాజకీయం మారిపోయింది. వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి తెలుగు దేశంలోకి వచ్చారు. ఆది రాకను రామసుబ్బారెడ్డి వ్యతిరేకించగా.. చంద్రబాబు సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. పార్టీలో చేరిన కొద్దిరోజులకే ఆదినారాయణరెడ్డిని మంత్రి పదవి వరించింది. ఈలోపే 2019 ఎన్నికలు వచ్చాయి. జమ్మలమడుగు అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. వెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు రెండు వర్గాలను పిలిచి సయోధ్య కుదిర్చారు. ఒకరు జమ్మలమడుగు ఎమ్మెల్యేగా.. మరొకరు కడప ఎంపీగా పోటీ చేయాలని సూచించారు. అక్కడా ఇద్దరు నేతల మధ్య రాజీ కుదరలేదు. ఇద్దరూ ఎమ్మెల్యేగానే పోటీచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ పంచాయితీ చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది.. ఇక లాభం లేదనుకున్న టీడీపీ అధినేత.. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారన్న నిర్ణయం తనకు వదిలేయాలన్నారు. రెండు వర్గాలతో చర్చించి.. రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా.. ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీ బరిలోకి దించారు. ఒకప్పుడు కత్తులు దూసుకున్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకే వేదికపై ప్రచారం చేస్తున్నారు. ఒకరి గెలుపు కోసం మరొకరు సహకరించుకుంటున్నారు. 
కమలాపురం: పుత్తా-వీరశివారెడ్డి 
కమలాపురం నియోజకవర్గానికి చెందిన పుత్తా-వీరశివారెడ్డి వర్గాలు ఒకప్పుడు ప్రత్యర్థులు. వీరశివారెడ్డి కాంగ్రెస్‌లో ఉంటే.. పుత్తా ఫ్యామిలీది టీడీపీ. తర్వాత మారిన రాజకీయంతో వీరశివారెడ్డి కూడా సైకిలెక్కారు. ఇరువురు నేతలు టికెట్ కోసం ప్రయత్నించగా పుత్తాకే దక్కింది. సీటు రాకపోవడంతో వీరశివారెడ్డి అలకబూనారు.. వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. వెంటనే సీన్‌లోకి వచ్చిన చంద్రబాబు.. ఇద్దర్ని పిలిచి మాట్లాడారు. వీరశివారెడ్డికి పార్టీలో, రాబోయే రోజుల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో మెత్తబడ్డారు. పుత్తా గెలుపు కోసం పనిచేస్తానన్నారు. ఈ ఇద్దరు నేతలు కూడా ఐక్యతతో ముందుకు సాగుతున్నారు. 
కర్నూలు జిల్లా: కోట్ల కుటుంబం-కేఈ ఫ్యామిలీ 
కర్నూలు జిల్లాను ఫ్యాక్షన్ రక్కసి వెంటాడింది. కోట్ల వర్సెస్ కేఈ కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు జరిగింది. తాతలనాటి నుంచి మొన్నటి వరకు రెండు కుటుంబాల మధ్య పొసిగేదే కాదు. రాజకీయాల్లో కోట్ల కుటుంబం కాంగ్రెస్‌ నుంచి.. కేఈ ఫ్యామిలీ టీడీపీ నుంచి ఢీ అంటే ఢీ అంటూ పోటీపడే వారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు జిల్లా రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు. కోట్ల రాకపై కేఈ ఫ్యామిలీ ఒకింత కినుక వహించింది. కొద్దిరోజులు సూర్యప్రకాష్ రెడ్డి చేరికపై సందిగ్థత నడిచింది. చంద్రబాబు కేఈ కుటుంబాన్ని అమరావతికి పిలిపించి సయోధ్య కుదిర్చారు. రెండు వర్గాలు కలిసి పనిచేయాలని తేల్చి చెప్పారు. పాత గొడవల్ని మర్చిపోయి ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. అధినేత చెప్పినట్లే రెండు కుటుంబాలు కలిసి పనిచేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా పట్టున్న నియోజకవర్గాల్లో ఒకరి గెలుపు కోసం మరొకరు ప్రచారం చేస్తున్నారు. 
పాణ్యం: గౌరు-బైరెడ్డి కుటుంబాలు 
కర్నూలు జిల్లాలో గౌరు-బైరెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడిచేది. రెండు కుటుంబాలకు పాణ్యంతో పాటూ మరో రెండు, మూడు నియోజకవర్గాల్లో బలమైన వర్గాలు ఉన్నాయి. బైరెడ్డి టీడీపీ తర్వాత సొంత పార్టీ.. కాంగ్రెస్‌లో ఉంటే.. గౌరు వర్గం కాంగ్రెస్.. ఆ తర్వాత వైసీపీలో చేరింది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టికెట్ ఆశించినా దక్కక పోవడంతో గౌరు చరితా రెడ్డి టీడీపీలో చేరి ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన బైరెడ్డి టీడీపీకి జై కొట్టారు. గౌరు, బైరెడ్డిలు పాత గొడవల్ని పక్కన పెట్టి టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేస్తున్నారు. 
రాజంపేట: మేడా-ఆకేపాటి 
ఇటు వైసీపీలో రాజంపేట నియోజకవర్గంలో మేడా-ఆకేపాటి వర్గాలు కలిసి పనిచేస్తున్నాయి. మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఈ సీటు పంచాయితీ వైసీపీకి తలనొప్పిగా మారగా.. ఇద్దరు నేతల్ని పిలిపించి జగన్ సర్దిచెప్పడంతో ఆకేపాటి మెత్తబడ్డారు. మేడా మల్లిఖార్జున్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తానని తేల్చి చెప్పారు. ఇద్దరు నేతలు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. 

No comments:

Post a Comment