Breaking News

23/04/2019

అనంత ఆస్పత్రికి సోలార్ వెలుగులు

అనంతపురం, ఏప్రిల్ 23, (way2newstv.in)
అనంతపురం జిల్లాల్లో సర్కారీ ఆఫీసుల్లో సోలార్ కరెంట్ వాడేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రారంభించి..మిగిలిన ఆఫీసుల్లో వాడేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఐసీయూలో, మరికొన్ని విభాగాల్లో నిరంతం ఏసీలు పనిచేస్తూనే ఉంటాయి. పక్కనే ఉన్న వైద్య కళాశాలలో కూడా విద్యుత్తు వినియోగం అధికమే. ఈ రెండింటికీ కలిపి నెలకు సగటున రూ.10 లక్షల మేర విద్యుత్తు బిల్లు వస్తోంది. అంటే... ఏటా రూ.1.2 కోట్లు వెచ్చించాల్సిందే. ఇకపై ఆ భారం తగ్గించే దిశగా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అనంతపురం జేఎన్‌టీయూలో కూడా 500 కిలోవాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నారు. అనంత జేఎన్‌టీయూ, చిత్తూరు జిల్లాలోని కలికిరి జేఎన్‌టీయూలో వీటిని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం జరిగింది. రెండు చోట్లా 500 కిలోవాట్ల మేర విద్యుదుత్పత్తి చేయనున్నారు. ఇక్కడి ప్రాజెక్ట్‌ను మైత్ర ఎనర్జీ సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ జేఎన్టీయూ భవనాల పైభాగంలో ప్యానెల్స్ ఏర్పాటుచేసి, విద్యుదుత్పత్తి ప్రారంభిస్తుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును జేఎన్‌టీయూ అవసరాలకు వినియోగిస్తారు.


అనంత ఆస్పత్రికి సోలార్ వెలుగులు

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో రెనెవబుల్‌ ఎనర్జీ సర్వీస్‌ కంపెనీ ద్వారా ఈ ప్రాజెక్టులను చేపడుతున్నారు.ఇప్పటికే జిల్లాలో పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ విధానం అమలు ఆరంభించారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పైభాగం ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి ఒక మెగావాట్‌, అడ్వాన్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు 800 కిలోవాట్లు, సత్యసాయి ఆర్చివ్స్‌కు 200 కేవీ, సత్యసాయి ఆసుపత్రికి 100 కేవీ కలిపి మొత్తం 2.1 మెగావాట్ల విద్యుత్తు అవసరమని తేల్చారు ప్రస్తుతం జేఎన్‌టీయూ వినియోగిస్తున్న విద్యుత్తుకు యూనిట్‌ రూ.8కి పైగా చెల్లిస్తుండగా, సౌర విద్యుత్తుకు వినియోగించుకుంటే యూనిట్‌కు రూ.4.13 చొప్పున చెల్లిస్తే చాలు. ఈమేరకు  25 ఏళ్లకు ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో జేఎన్టీయూ భవనాలపై స్థలమే పెట్టుబడి కానుంది.కేవలం ఆసుపత్రి పైభాగంలో ఉన్న ఖాళీ స్థలం ఏపీ సోలార్‌ కార్పొరేషన్‌కు ఇస్తే సరిపోతుంది. ఇందులో సౌర విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసి, అక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్తు సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు. . దీంతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పైభాగంలో రెండు మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి ఏర్పాట్లు చేశారు.ఇక సర్వజన ఆసుపత్రిలో 275 కిలోవాట్లు, వైద్య కళాశాలలో 100 కిలోవాట్ల మేర సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో రెండింటికీ వచ్చే విద్యుత్తు బిల్లు భారం కూడా సగం తగ్గనుంది. జిల్లా పరిషత్‌లో కూడా సౌర విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటుపై ఏపీ సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌ క్యాప్‌) అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. జేఎన్టీయూ పక్కనే ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సైతం సౌర విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నారు.

No comments:

Post a Comment