Breaking News

24/04/2019

పోల్ మేనేజ్ మెంట్ పైనే ఆశలు

తిరుపతి,ఏప్రిల్ 24, (way2newstv.in)
తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఏ పార్టీ విజ‌యం సాధిస్తుంది? అధికార టీడీపీ త‌న ప‌ట్టును కొన‌సాగించ‌నుందా? లేక వైసీపీ దూకుడు ప్రద‌ర్శించి ఈ సీటును త‌న ఖాతాలో వేసుకుంటుందా? వ్యూహ ప్రతివ్యూహాల‌తో సాగిన తిరుప‌తి ఎన్నిక‌ల పోరు ఎవ‌రికి ప్లస్‌? ఎవ‌రికి మైన‌స్‌? – ఈ చ‌ర్చే ఇప్పుడు ర‌స‌వ‌త్తరంగా సాగుతోంది. ఏ ఇద్దరు క‌లిసినా.. ఈ అంశంపైనే చ‌ర్చించుకుంటున్నారు. ప్రతి ఒక్క‌రూ దీని గురించే మాట్లాడుతున్నారు. టీడీపీ త‌ర‌ఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ, వైసీపీ త‌ర‌ఫున భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డిలు ఇక్కడ ప్రధానంగా పోరులో నిలిచారు. జ‌న‌సేన నుంచి బ‌ల‌మైన నాయ‌కుడిగా చ‌ద‌ల‌వాడ కృష్ణమూర్తి రంగంలోకి దిగారు. అయిన‌ప్పటికీ.. ప్రధానంగా ఎన్నిక‌ల పోరు మాత్రం సుగుణ‌మ్మ, భూమ‌న‌ల మ‌ధ్యే జ‌రిగింద‌నేది వాస్తవం.ఇక‌, ఈ ఇద్దరూ కూడా వ్యూహాత్మకంగా ఈ ఎన్నిక‌ల్లో ప్రచారం చేశారు. ముందు నుంచి కూడా టికెట్‌పై ధీమాగా ఉన్న సుగుణ‌మ్మ ప్రచారాన్ని కూడా చాలా దూకుడుగా నిర్వహించారు. అయితే, ఆమె అల్లుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని బాగానే సంపాయించుకున్నార‌నే విమ‌ర్శలు వ‌చ్చాయి. 


పోల్ మేనేజ్ మెంట్ పైనే ఆశలు 

ఇక‌, ఎమ్మెల్యేగా సుగుణ‌మ్మ దూకుడు చూపించ‌లేక‌పోయార‌ని, ఎక్కడి అభివృద్ధి ప‌నులు అక్కడే అన్నట్టుగా సాగాయ‌ని, టీడీపీలోనే ఉన్న చ‌ద‌ల‌వాడ కృష్ణమూర్తి..కూడా సుగుణ‌మ్మను టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలు కూడా బాగానే ప‌నిచేశాయి. అభివృద్దిలో ఆమెకు అడుగ‌డుగునా చ‌ద‌ల‌వాడ స‌వాళ్లు రువ్వారు. ఇక‌, ఆయ‌న‌కు టికెట్ ద‌క్కద‌ని భావించిన నేప‌థ్యంలో టీడీపీని విడిచి జ‌న‌సేన‌లోకి అరంగేట్రం చేశారు. అదే స‌మ‌యంలో అధికారుల‌తోనూ ఎమ్మెల్యేగా సుగుణ‌మ్మ స‌మ‌న్వయం చేసుకోలేక‌పోయింద‌నే విమ‌ర్శలు వ‌చ్చాయి.ఇదెలా ఉన్నప్పటికీ.. ఎన్నిక‌ల వ్యూహం, ప్రచారంలో మాత్రం ఆమె దూకుడుగానే ప్రవ‌ర్తించారు. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఆది నుంచి ప్రజ‌ల‌మ‌ధ్యే ఉంటూ వ‌చ్చిన భూమ‌న.. ఎన్నిక‌ల ప్రచారంలో మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుగుణ‌మ్మ దూకుడు ప్రచారం ముందు భూమ‌న ప్రచారం తేలిపోయింద‌ని కొన్ని సంద‌ర్భాల్లో వ్యాఖ్యలు కూడా వినిపించాయి. ఇక‌, పోల్ మేనేజ్‌మెంట్ విష‌యానికి వ‌చ్చేస‌రికి పూర్తిగా రివ‌ర్స్ అయింది. పోల్ మేనేజ్‌మెంట్‌లో సుగుణ‌మ్మ చ‌తికిల ప‌డ‌గా.. భూమ‌న దూకుడు ప్రద‌ర్శించారు. దీంతో ప్రచారం క‌న్నా .. కూడా పోల్ మేనేజ్‌మెంట్ విష‌యంలో వైసీపీ స‌క్సెస్ అయింద‌నే వ్యాఖ్యలు వినిపించాయి.కీల‌క‌మైన పోల్ మేనేజ్‌మెంట్ విష‌యంలో వైసీపీ టీడీపీని మించి స‌క్సెస్ అవ్వడంతో తిరుప‌తి విజేత‌ను ఎవ్వరూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. ఎవ‌రికి వారు గెలుపు త‌మ‌దే అని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అటు స‌గుణ‌మ్మ గెలుస్తుందా? లేక భూమన ప‌ట్టు సాధించారా? అనే విష‌యంపై సందేహాలు నెల‌కొన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో సుగుణ‌మ్మ భ‌ర్త వెంక‌ట ర‌మ‌ణ 41 వేల ఓట్ల‌ భారీ మెజారిటీతో విజ‌యం సాధించ‌గా, ఆయ‌న మ‌ర‌ణంత‌ర్వాత జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో సుగుణ‌మ్మ ల‌క్ష మెజారిటీతో సీటును నిల‌బెట్టుకున్నారు. మ‌రి ఈ దూకుడు ఆమె కొన‌సాగించారా? లేక భూమ‌న ఎన్నిక ఖ‌రారు కానుందా? అనేవిష‌యంపై స‌ర్వత్రా ఆస‌క్తి నెల‌కొంది. భూమ‌న గెలుపు త‌న‌దే అని చెపుతుంటే… సుగుణ‌మ్మ మాత్రం మెజార్టీ త‌గ్గినా ఖ‌చ్చితంగా మ‌ళ్లీ తానే గెలుస్తాన‌ని అంటున్నారు. ఈ స‌స్పెన్స్‌కి మే 23 న కానీ తెర‌ప‌డేలా క‌నిపించ‌డం లేదు.

No comments:

Post a Comment