Breaking News

12/04/2019

పోలింగ్ పెరిగితే ఎవరికి లాభం..

 విజయవాడ, ఏప్రిల్ 12 (way2newstv.in)
పోలింగ్ శాతం ఏం చెబుతోంది? ఎవరిది గెలుపు? ఆంధ్రప్రదేశ్ లో మునుపెన్నడూ లేని విధంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఉదయం ఐదున్నర గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవడం ఒక విశేషంగానే చెప్పుకోవాలి. అంతేకాదు ఏపీలో పోల్ పర్సంటేజ్ 75 నుంచి 80 శాతం వరకూ చేరుకుంటుందని ఎన్నికల సంఘం కూడా అంచనా వేస్తోంది. ఏ పోలింగ్ బూత్ చూసినా ఓటర్లు బారులు తీరి ఉండటంతో ఆరుగంటలకు సమయం ముగిసినా క్యూలైన్లో ఉంటే ఓటు హక్కు వినియోగించుకునే వీలుంది. మధ్యాహ్నం 3గంటలకే ఏపీలో పోలింగ్ శాతం 54 శాతం జరిగింది.అయితే ఎక్కువగా పోలింగ్ శాతం జరిగితే అడ్వాంటేజీ ప్రతిపక్ష పార్టీకే ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. ఓటర్లు కసి కొద్దీ పోలింగ్ కేంద్రాల వద్ద వెయిట్ చేశారంటే అది అధికార పార్టీ మీద అసంతృప్తి మాత్రమేనన్నది గతంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. 


పోలింగ్ పెరిగితే ఎవరికి లాభం..

ఆంద్రప్రదేశ్ లో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఫలితాలు అనుకూలంగా ఉండే సంకేతాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య టగ్ ఆఫ్ వార్ గా ఎన్నికలు జరిగాయి.జగన్ పాదయాత్ర ముగిసిన వెంటనే, ఆ వేడి చల్లారకముందే ఎన్నికల నోటిఫికేషన్ రావడం తమకు కలసి వచ్చిందని వైసీపీ నేతలు అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారంటే అది టీడీపీ పై ఉన్న వ్యతిరేకతమాత్రమేనని వైసీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ప్రతి నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థులు టీడీపీని ధీటుగా ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు ఎన్నికల చివరి రోజుల్లో ఇచ్చిన హామీలను ప్రజలు విశ్వసించలేదని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.టీడీపీ కూడా కొంత తమకు అనుకూలంగా మలచుకుంటోంది. ఓటర్లు కసిగా వచ్చారంటే మరోసారి చంద్రబాబు ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యంతోనేనన్నది టీడీపీ నేతల అభిప్రాయం. ముఖ్యంగా మహిళలు పెద్దయెత్తున తరలి రావడం సైకిల్ పార్టీని గెలిపించడానికేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏపీలో సైలెంట్ గా వేవ్ ఉందని, అది చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారంటున్నారు. మొత్తం మీద పోలింగ్ సరళిని ఎవరికి వారే తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే పోలింగ్ సరళి పెరగడం అధికార పార్టీని ఆందోళనకు గురిచేసే అంశమేనని చెప్పాలి.

No comments:

Post a Comment