కోల్ కత్తా, ఏప్రిల్ 23 (way2newstv.in)
ఫెడరల్ ఫ్రంట్. గత డిసెంబరు నుంచి నేటి వరకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ నోటి నుంచి తరచుగా వినిపిస్తున్న మాట. కేంద్రంలో ప్రధాన నరేంద్ర మోడీని గద్దె దింపి, రాష్ట్రాలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అప్పుడే రాష్ట్రాల సమస్యలు తీరుతాయని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు.ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి.. పలు రాష్ట్ర పార్టీల మద్దతును కూడా కూడగట్టేందుకు ప్రయత్నించారు. ఇక, ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తమతోనే ఉందని బహిరంగంగానే వెల్లడించారు. మే 23 నాటి ఫలితాల్లో ప్రాంతీయ పార్టీల బలమే ఎక్కువగా కనిపిస్తుందని, కాబట్టి కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్లకు మేజిక్ ఫిగర్ను చేరుకునే స్థాయిలో సంఖ్యాబలం ఉండదని కేసీఆర్ చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉరఫ్ దీదీ కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు.
ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పుతాయా
రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాపాడుకునేందుకు, కేంద్రం పెత్తనాన్ని అణగదొక్కేందుకు బీజేపీని ఓడించి తీరాలని, అదే సమయంలో రాష్ట్రాలన్నీ కలిసి ఓ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆమె కోరుతున్నారు. నిజానికి అటు దీదీ, ఇటు కేసీఆర్ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. కేసీఆర్తో జట్టుకట్టేందుకు చంద్రబాబు, నవీన్ పట్నాయక్, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, బీఎస్పీ మాయావతి, ఆప్ నేత కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా వంటివారు సిద్ధంగా లేక పోవడం గమనార్హం. దీనికి కారణాలు ఎలా ఉన్నప్పటికీ.. కేసీఆర్ను జాతీయ స్థాయి నేతగా గుర్తించేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు కూడా కేసీఆర్ను తీవ్రంగా విభేదిస్తుండడం దీనికి ప్రధాన కారణమని అంటున్నారు.కేసీఆర్ లోపాయికారీగా.. ప్రధాని మోడీకి సహకరిస్తున్నారనే వ్యాఖ్యలు తరచుగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఈ ప్రచారాన్ని తారాస్థాయికి కూడా తీసుకు వెళ్లారు. దీంతో కేసీఆర్తో కలిసేందుకు మోడీ వ్యతిరేకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అదేసమయంలో దూకుడుగా మాట్లాడుతున్న దీదీకి జై కొట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్తోనూ మమత టచ్లోకి వచ్చారని అంటున్నారు. దీంతో.. రాజకీయ పరిస్థితులు మారిపోతే… కేసీఆర్ కూడా ప్రొ బీజేపీ స్టాండ్ను వదిలేసి… ఇతర ప్రాంతీయ పార్టీల గూటిలోకి చేరుతారనే ప్రచారం ఊపందుకుంటోంది. కేసీఆర్ చెప్పే ఫ్రంట్లో.. ఇప్పుడు.. కేసీఆర్తో పాటు జగన్ మాత్రమే ఉన్నారు. మమతా బెనర్జీ… కేసీఆర్తో తాను టచ్లో ఉన్నానని చెబుతున్నారు. అంటే… జగన్మోహన్ రెడ్డిని.. అలా వదిలేయడానికి కేసీఆర్ రెడీ అయిపోయినట్లేనన్న భావన రాజకీయవర్గాలకు వస్తోంది. మొత్తానికి ఈ పరిణామం ఓకే అయితే.. దీదీనే ఫెడరల్ ఫ్రంట్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు.
No comments:
Post a Comment