Breaking News

05/03/2019

హైద్రాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సులు

హైద్రాబాద్, మార్చి 5 (way2newstv.in)
హైదరాబాద్ నగర వాసులకు టీఎస్ఆర్టీసీ మరో అధునాతన రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో వాడుతోన్న వాతావరణ సహిత  ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ రోడ్లపై పరుగులు తీయనున్నాయి. తొలి విడతగా 40 ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ట్రయల్ రన్స్ ను 
విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ బస్సులను మంగళవారం సాయంత్రం మియాపూర్-2 డిపో నుంచి లాంఛనంగా ప్రారంభించనుంది. అయితే, ఈ బస్సులను నగరం నుంచి  శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 


హైద్రాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సులు

తొలి విడతగా మియాపూర్-2, కంటోన్మెంట్ డిపోల నుంచి 20 బస్సుల  చొప్పున శంషాబాద్ విమానాశ్రయం రూట్లలో నడపనున్నారు. విమానాశ్రయంలో గ్రేటర్ ఆర్టీసీ వీటిని ఆపరేట్ చేయనుంది. ప్రస్తుతం నడుస్తోన్న ఏసీ బస్సుల చార్జీలనే ఎలక్ట్రిక్ 
బస్సుల్లోనూ వసూలు చేయనున్నారు. భవిష్యత్తులో ప్రయాణికుల నుంచి వచ్చే డిమాండ్ను బట్టి ఇతర రూట్లలోనూ ఈ బస్సులను నడిపే అవకాశాలను పరిశీలిస్తామని  ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేకంగా మియాపూర్-2, కంటోన్మెంట్ డిపోలలో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు  వెల్లడించారు. ఒక్కో చార్జింగ్ స్టేషన్లో ఒకేసారి 10 నుంచి 12 బస్సులకు చార్జింగ్ పెట్టే వీలుందన్నారు. ఒక బస్సును 4 గంటలు చార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్లు వరకు  తిరుగుందని తెలిపారు. 
ఎలక్ట్రిక్ బస్సులు తిరిగే రూట్లు.. 
✦ జేబీఎస్ నుంచి సంగీత్, ఉప్పల్, ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు 
✦ జేబీఎస్ నుంచి సంగీత్, ప్యారడైజ్, సెక్రటేరియట్, మాసబ్ ట్యాంక్, పీవీ ఎక్స్ప్రెస్ వే మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు 
✦ బీహెచ్ ఈఎల్ నుంచి ఆల్విన్ క్రాస్ రోడ్, కొండాపూర్, శిల్పారామం, సైబర్ సిటీ, గచ్చిబౌలి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు 
✦ మియాపూర్ నుంచి కేపీహెచ్బీ, జేఎన్టీయూ, ఫోరం మాల్, సైబర్ టవర్, గచ్చిబౌలి నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 

No comments:

Post a Comment