Breaking News

12/03/2019

టీడీపీలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ?

అమరావతి  మార్చ్ 12  (way2newstv.in)
అధికార పార్టీ టీడీపీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విశాఖ జిల్లా భీమిలి నుంచి శాసనసభకు మాజీ జేడీ పోటీ చేస్తారని తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గం నుంచి సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ భీమిలి నుంచి పోటీ చేస్తారని.. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఎంపీగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే విశాఖ ఉత్తర నుంచి లోకేశ్‌ను పోటీ చేయించాలని చంద్రబాబు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.కాగా.. మహారాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన లక్ష్మీ నారాయణ తన పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలిగి.. ప్రజాసేవ చేయాలని భావించి ఇప్పటికే అటు రాయలసీమ.. ఇటు కోస్తాఆంధ్రలో దాదాపు అన్ని జిల్లాల్లో ఆయన పర్యటించారు. 


టీడీపీలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ?

ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే అప్పట్లో మాజీ జేడీ కొత్త పార్టీ పెడతారని పుకార్లు వచ్చాయి. ఒకానొక సందర్భంలో ఆయన లోక్‌సత్తా నుంచి ఆహ్వానం రావడంతో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు గుప్పుమన్న విషయం విదితమే.ఐతే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారా..? లేదా అనే విషయంపై ఇంత వరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. సోషల్ మీడియా.. టీవీ ఛానెల్స్, వార్తాపత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఇంతవరకూ లక్ష్మీ నారాయణ స్పందించలేదు. అయితే మంగళవారం సాయంత్రంలోపు ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు.. లక్ష్మీ నారాయణతో మంతనాలు జరిపారని సమాచారం. ఆయన కూడా టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే రెండ్రోజుల్లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారని సమాచారం.

No comments:

Post a Comment