Breaking News

27/03/2019

ఆక్వా సాగుతో చెరువులు

ఏలూరు, మార్చి 27, (way2newstv.com)
వీరవాసరం మండలంలో తవ్వుకున్న వారికి తవ్వుకున్నంతగా అధికారులు ఆక్వా సాగుకు అనుమతులు ఇస్తుండటంతో భారీగా చెరువుల తవ్వకాలు సాగుతున్నాయి. గతంలో ఒకటి ఆరాగా చెరువులు తవ్వేవారు కానీ ఇటీవల పదుల సంఖ్యలో ఒకే చోట చెరువు తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. చెరువులు తవ్వుకోవాలంటే ముందుగా ఆ భూమిని ఏ విధంగా సిద్ధం చేయాలో అధికారులే సూచనల్విడంతో అనుమతులు పొందడానికి ఎలాంటి అడ్డంకులూ లేకుండా పోతున్నాయి. దీంతో సాఫీగానే వీటి తవ్వకాలకు అడ్డుఅదుపులేకుండా పోతోంది. పర్యావరణ సమతుల్యంతో పనేముంది విదేశీ మారకం పేరుతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందా లేదా అన్నదే అంశంగా ఈ చెరువు తవ్వకాలు జరుగుతున్నాయి. చేపల పేరుతో సాగుకు అనుమతులు పొంది రొయ్యల చెరువు సాగు చేస్తున్నా పట్టించుకున్న అధికారులే లేరు. కేవలం సాగుకు పనికిరాని, మురుగునీరు పారుదల సక్రమంగాలేని భూములను మాత్రమే చెరువులుగా మార్చుకునేందుకు అవకాశం ఉంది. కానీ మండలంలో అధికారుల సూచనలు మేరకు ముందుగానే చెరువులుగా మార్చుకునే భూములను బీడు భూములుగా, పండని భూమిగా తయారు చేస్తున్నారు. ఇందుకు రైతులతో ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. 


ఆక్వా సాగుతో చెరువులు

చెరువులు తవ్వే సమయానికి ఒక సంవత్సరం ముందుగానే రైతులతో ఒప్పందం కుదుర్చుకుని వారికి సంవత్సరం ముందు నుండి భూ యజమానులకు కౌలు చెల్లించి వారి భూములను బీడు భూములుగా మారుస్తున్నారు. ఆ తరువాత చెరువు తవ్వకానికి అనుమతులు దరఖాస్తు చేస్తున్నారు. ప్రాథమిక పరిశీలనలో భాగంగా ముందుగా వ్యవసాయాధికారులు అప్పటికే బీడుగా మార్చిన సంత్సరానికి మూడు పంటలు పండే ఆ భూములను బీడు భూములుగా నిర్థారిస్తారు. దీంతో మొదటి అంకం పూర్తవుతుంది. దీంతో అ తరువాత ఆ శాఖాధికారుల స్థానికంగా పరిశీలించకుండానే మామూళ్ల మత్తులో ఇతర అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో అప్పటి వరకూ పచ్చగా ఉన్న వరి భూముల కాస్త రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయి. ఈ విధంగా ఒక సంవత్సరం క్రితం పెర్కిపాలెం గ్రామంలో సుమారు వంద ఎకరాల ఆయకట్టుకు చెరువులుగా మార్చుకునేందుకు వరి పండించే రైతులతో ఐదు సంవత్సరాల పాటు రొయ్యల సాగు చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుని గత కొద్ది రోజులుగా చెరువుల తవ్వకం యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఎగువన పంట కాలువ, దిగువన మురుగు కాలువ వరి పంటకు అనుకూలమైన పరిస్థితులున్న ఈ ప్రాంతంలో రొయ్యల సాగుకు అనుమతులిచ్చేశారు. గత పది సంవత్సరాల కాలంగా ఈ భూములలో వరి పంట ఏ విధంగా పండింది. ఏ మేరకు దిగుబడి వచ్చింది అనే అంశాలు పరిగణనలోకి తీసుకోకుండా రొయ్యల చెరువులు తవ్వుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది స్వార్థం కోసం భవిష్యత్‌ దుష్ఫరిణామాలు ఆలోచించకుండా విచ్ఛలవిడిగా అనుమతులివ్వడం ఎంత వరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు. సుమారు 500 మీటర్లు లోతుకెళ్లి అక్కడ ఉన్న ఉప్పగా ఉండే జలాలను పైకి తేవడం వల్ల ఉపరితల చప్పనీటి జలాలు కలుషితమతున్నా పట్టించుకేనే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. ఇప్పటికే వీరవాసరం పశ్చిమ కాలువకు ఆనుకుని శృంగవృక్షం, పెర్కిపాలెంలో ఉన్న రొయ్యల చెరువుల కలుషిత జలాలను యథేచ్ఛగా వదిలివేస్తున్నారు. దీంతో కాలువ కింద ఉన్న గ్రామాల ప్రజలు కలుషిత తాగునీరు తాగాల్సిన పరిస్థితులున్నాయి. ఇవేమీ అధికారులకు కానరావడం లేదు. రాజకీయ పలుకుబడి, రాజీకీయ నాయకుల ఒత్తిడి వల్లే అనుమతులు ఇవ్వాల్సి వస్తుందంటూ స్థానిక అధికారులు తప్పించుకుంటున్నారు. చెరువులు తవ్వే క్రమంలో భారీ వృక్షాలను సైతం విచక్షణరహితంగా తొలగించేస్తున్నారు. కల్లుగీత కార్మికులకు ఉపాధిగా ఉన్న తాటి చెట్లను సైత భారీ సంఖ్యలో తొలగించడంతో కల్లుగీత వృత్తిపై ఆధారపడ్డ కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతుంది. దీంతో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. అప్పటి వరకూ గ్రామంలో ఉన్న వ్యవసాయ కార్మికులు ఉపాధిగా ఉన్న పంటభూములు కనుమరుగవడంతో స్థానిక కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయి. జిల్లా అధికారులు ఆక్వా చెరువులకు అనుమతులు మంజూరు చేసే క్రమంలో స్థానిక ఉపాధి అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

No comments:

Post a Comment