Breaking News

07/03/2019

రైల్వే ప్రాజె క్టుల పై నీలినీడలు

హైద్రాబాద్, మార్చి 7, (way2newstv.in)
గ్రేటర్ హైదరాబాద్‌లో  ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైల్వే ప్రాజె క్టుల పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఏళ్లుగా ఎలాంటి పురోగతి లేకుండా పెండింగ్ జాబితాకే పరిమితమవుతున్న ప్రాజెక్టులపై అప్పుడప్పుడు అధికారుల స్థాయి లో సంప్రదింపులు, చర్చలు మినహా ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు.రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుల్లో సింహభాగం రాష్ట్రం అందజేసే నిధులు, వనరులపైనే  ఆధారపడి ఉన్నాయి. కానీ కేటాయింపుల్లో సమన్వయలేమి కనిపిస్తోంది. ఇరువర్గాల మధ్య చర్చలు జరిగిన ప్పటికీ అవి అధికారుల స్థాయికే పరిమితం కావడంతో నిధులు కేటాయింపులో ప్రభుత్వాన్ని  కదిలించలేకపోతున్నాయి.దీంతో రైల్వే ప్రాజె క్టులపై చాలా కాలంగా నిర్లక్ష్యం కొనసాగుతోంది. ప్రజ ల మౌలిక అవసరాలను, రవాణా సదుపాయాలను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన ప్రాజెక్టులు సైతం అతీగతీ లేకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రాజెక్టుల ప్రాధాన్యతపై తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. ఎదురుచూపులే మిగులుతున్నాయి. నగరంలోని మూడు ప్రధాన రైల్వేస్టేషన్లలో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన చర్లపల్లి రైల్వే టర్మినల్‌కు  భూమి కొరత పెద్ద సమస్యగా మారింది. 


రైల్వే ప్రాజె క్టుల పై నీలినీడలు

పది ప్లాట్‌ఫారాలతో చర్లపల్లి విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం రైల్వేకు అందుబాటులో ఉన్న భూమికి మరో 100 ఎకరాల వరకు  కేటాయించేందుకు మూడేళ్ల క్రితం ప్రభుత్వం అంగీకరించింది.ఇక్కడ టర్మినల్ నిర్మించడంతో విశ్వనగర నిర్మాణానికి అనుకూలమైన రవాణా సదుపాయాలను విస్తరించేందుకు అవకాశం ఉంటుందని భావించారు. నగర శివారు ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు చర్లపల్లి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. సుమారు రూ.85 కోట్ల అంచనాలతో చేపట్టిన ఈ  ప్రాజెక్టుకు రైల్వేశాఖ ఇప్పటి వరకు రూ.15 కోట్ల వరకు నిధులను అందజేసింది. కానీ ఇంకా పనులు మొదలు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగినంత భూమి లభిస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. చర్లపల్లి వినియోగంలోకి వస్తే ప్రతిరోజు 180  రైళ్లు, సుమారు 2. లక్షల మంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ స్టేషన్‌పై  50 శాతం ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణికులకు కూడా మెరుగైన, నాణ్యమైన సదుపాయాలు లభిస్తాయి.ఇక ఎంఎంటీఎస్ రెండో దశ ‘ఇంకా ఎంతెంత దూరం...’ అన్నట్లుగా మారింది. అనేక రకాల అడ్డంకులను అధిగమించి ఈ ప్రాజెక్టు ఒక కొలిక్కి వచ్చినప్పటికీ రైళ్లు మాత్రం పట్టాలెక్కలేకపోతున్నాయి. 2013లో చేపట్టిన  రెండో దశకు నిధుల కొరత పెద్ద సవాల్గా మారింది. ఆ తరువాత భూమి లభ్యత మరో సవాల్గా నిలిచింది. ఈ రెండింటిని అధిగమించి క్రమంగా పనుల్లో వేగం పెంచారు.ఇప్పటి వరకు రెండు మార్గాలు మాత్రం పూర్తయ్యాయి. మరో 4 లైన్లలో నిర్మాణ దశలో ఉన్నాయి. పనులు పూర్తయిన సికింద్రాబాద్‌బొల్లారం, పటాన్చెరుతెల్లాపూర్లలో ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ మళ్లీ నిధుల కొరత  ముందుకొచ్చింది. రూ.850 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం మూడొంతుల నిధులు ఇవ్వాల్సి ఉంది.రెండో దశ కోసం కనీసం 9 రైళ్లు అవసరమని గుర్తించారు. ఇందుకోసం రూ.250 కోట్ల మేరకు  ప్రతిపాదించారు. జనరల్ మేనేజర్ స్థాయిలో గతంలోనే ఈ అంశంపై  సంప్రదింపులు జరిగాయి. కానీ పురోగతి లేదు. లైన్లు ఉన్నా రైళ్లు పట్టాలెక్కని పరిస్థితి. 

No comments:

Post a Comment