Breaking News

12/03/2019

అద్వానీ పోటీకి అంతా సిద్దం

గాంధీనగర్, మార్చి 12, (way2newstv.in)
బీజేపీ కురువృద్ధుడు అద్వానీ ఈసారి కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు శుక్రవారం రాత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ నిర్ణయంపై బీజేపీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. లోక్‌సభ  ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే బీజేపీ నేతలకు వయస్సు అనేది ఈసారి కూడా అడ్డుకాకపోవచ్చని తెలుస్తోంది.75 ఏళ్లు పైబడిన నేతల పోటీకి  ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్టు సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే బీజేపీ  అగ్రనేతలు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శాంతకుమార్ తదితరులు 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు మార్గం సుగమమైనట్టే. 


అద్వానీ పోటీకి అంతా సిద్దం

అయితే పోటీకి  వీరు సుముఖంగా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.గుజరాత్‌లోని  గాంధీనగర్ లోక్‌సభ  నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 91 ఏళ్ల అద్వానీ ఈసారి కూడా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తే జేడీయూ నేత రామ్ సుందర్ దాస్ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన అతి పెద్ద వయస్కుడైన రెండవ వ్యక్తిగా నిలుస్తారు. రామ్ సుందర్ దాస్ తన 88వ ఏట హజీపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. 93 ఏళ్ల వయస్సులో ఆయన పదవీకాలం పూర్తయింది. మరో సీనియర్ నేత  మురళీ మనోహర్ జోషి 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాన్పూర్ నుంచి గెలిచారు. మరోవైపు దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తర్వాత అద్వానీ, జోషిలను అగ్రనేతలుగా పార్టీ పరిగణిస్తున్నప్పటికీ  వారికి  పార్లమెంటరీ బోర్డులో మాత్రం చోటు కల్పించలేదు. అయితే అమిత్ షా  పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ‘మార్గదర్శక్ మండలి’ని ఏర్పాటు చేశారు. ఇందులో  ఆయనతోపాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ అగ్రనేతలు అద్వానీ,  మురళీ మనోహర్ జోషి సభ్యులుగా ఉన్నారు. మరోవైపు  పార్టీ, ప్రభుత్వ పదవులకు బీజేపీ విధించిన 75 ఏళ్ల వయోపరిమితి  యథాప్రకారం కొనసాగుతుందని తెలుస్తోంది.

No comments:

Post a Comment