Breaking News

19/03/2019

20 నుంచి హైటెక్ సిటీ మెట్రో

హైద్రాబాద్, మార్చి 19, (way2newstv.in)
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో కీలక అడుగు బుధవారం పడబోతోంది. గ్రేటర్‌ ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న హైటెక్ సిటీ మెట్రో రైలు 20న దూసుకెళ్లబోతోంది. అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో ఉదయం 9.30 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ జెండా ఊపి హైటెక్‌ సిటీకి తొలి మెట్రో రైలును ప్రారంభిస్తారు. ఎన్నికల కోడ్‌ ఉంది కాబట్టి ఈ కార్యక్రమం హడావుడి లేకుండా సైలెంట్‌గా సాగబోతోంది. అయినప్పటికీ... అమీర్ పేట, హైటెక్ సిటీ రూటుకి ఉన్న డిమాండ్, వచ్చే క్రేజే వేరు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. వాటి ద్వారా 18 నిమిషాల్లో అమీర్‌పేట్‌ నుంచి హైటెక్‌ సిటీ చేరుకోవచ్చు. జూబ్లీ చెక్‌పోస్ట్‌ నుంచి సింగిల్‌ట్రాక్‌లో మెట్రోరైలు హైటెక్‌సిటీ వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వెనక్కి వస్తుంది. నాగోల్‌ నుంచీ హైటెక్‌ సిటీకి మెట్రోలో 55 నిమిషాల్లో వెళ్లొచ్చు. అదే రోడ్డు మార్గంలో వెళ్లాలంటే... ట్రాఫిక్ వల్ల దాదాపు 2 గంటలు పడుతుంది. మెట్రో ట్రైన్ వల్ల ట్రాఫిక్ జామ్ కొంతైనా తగ్గే అవకాశాలున్నాయి.


20 నుంచి హైటెక్ సిటీ మెట్రో  


* అమీర్‌పేట, తరుణి–మధురానగర్, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.5, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్‌ సిటీ స్టేషన్లు ఉన్నాయి.
* తరుణి మధురానగర్‌ స్టేషన్‌లో మహిళలు, పిల్లల కోసం అన్ని రకాల వస్తువులూ ఉంచారు. ఈ స్టేషన్‌ దాదాపు 2 ఎకరాల్లో విశాలంగా ఉంటుంది. దేశంలో ఇలాంటి సౌకర్యాలున్న మెట్రోస్టేషన్‌ ఇదే.
* మిగతా మెట్రో స్టేషన్లు రెండంతస్తుల్లో ఉండగా, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ స్టేషన్‌ ట్రాఫిక్‌ కారణంగా ఒకే అంతస్తులో నిర్మించారు.
* జూబ్లీ చెక్‌పోస్ట్‌ నుంచి హైటెక్‌సిటీ వరకు (5 కి.మీ.) మార్గంలో మెట్రో మార్గం సింగిల్‌ ట్రాక్‌ ఉంది. అంటే ఒక రైలు అమీర్‌పేట్‌ నుంచి బయలుదేరి హైటెక్‌సిటీ వరకు వెళ్లి అక్కడి నుంచి ఒకే ట్రాక్‌లో తిరిగి రావాల్సి ఉంటుంది. అందువల్ల ఈ రూట్లో ప్రతి 9 నుంచి 12 నిమిషాలకో రైలు మాత్రమే నడపనున్నారు.
* ప్రస్తుతం ఎల్బీనగర్‌–మియాపూర్, నాగోల్‌–అమీర్‌పేట్‌ మార్గంలో ప్రతి 6 నిమిషాలకో రైలు నడుపుతున్నారు.
* అమీర్ పేట - హైటెక్ సిటీ మార్గంలో రోజూ లక్ష మంది దాకా మెట్రో రైలులో ప్రయాణించే అవకాశం ఉంది.
* ప్రస్తుతం నాగోల్‌–అమీర్‌పేట్, ఎల్బీనగర్‌–మియాపూర్‌ రూట్లలో రోజూ 2 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తున్నారు.
* మెట్రో అందుబాటులోకి వచ్చిన మార్గాలు... ఎల్బీనగర్‌–మియాపూర్‌ (29 కి.మీ.), నాగోల్‌–అమీర్‌పేట్‌ (17 కి.మీ.), అమీర్‌పేట–హైటెక్‌సిటీ (10 కి.మీ.)
* మెట్రో అందుబాటులోకి రావాల్సిన మార్గాలు... జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ (డిసెంబర్‌కి పూర్తయ్యే ఛాన్స్), ఎంజీబీఎస్‌–ఓల్డ్ సిటీ (డిసెంబర్‌కి పూర్తయ్యే ఛాన్స్)

No comments:

Post a Comment