హైదరాబాద్, ఆగస్టు 22 (way2newstv.in)
న్యూస్ ;తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రగతి పథంలోకి తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి మార్గ నిర్ధేశకాలతో సమూలమైన మార్పుల కోసం అధ్యయనం చేయడం జరుగుతోందని రవాణా శాఖా మంత్రి డా.పట్నం మహేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ సభ్యులు రెండో సారి మంగళవారం బస్ భవన్లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సంస్థ అధ్యక్షులు సోమారపు సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్, టి.ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఐ.ఎ.ఎస్,తో కలిసి మంత్రి అధ్యయన కమిటీ తీరుతెన్నులను వివరించారు. సంస్థ పురోభివృద్ధిని కాంక్షించి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గతంలో మంత్రులతో సబ్ కమిటీని వేయడం జరిగిందని, ఈ క్రమంలోనే ఏర్పాటైన నిపుణుల కమిటీ అధ్యయనం తరువాత రూపొందించే నివేదికను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
టి.ఎస్.ఆర్టీసీ పురోగతికి నిర్మాణాత్మక చర్యలు
రవాణా మంత్రి డా.పట్నం మహేందర్ రెడ్డి
టి.ఎస్.ఆర్.టి.సి ఆర్థిక స్థితిపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకై ఇతర రాష్ట్రాలలో రవాణా వ్యవస్థను కూడా పరిశీలించి సంస్థ బలోపేతంకు కృషి చేయాలని సూచించారు. అంతర్గత సామార్థ్యంను మెరుగుపరిచేందు కోసం అవసరమైన వనరులను సమకూర్చుకోవటంతో పాటు ఖర్చు తగ్గించుకోవటం, ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవటం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. దేశంలోనే టి.ఎస్.ఆర్టీసిని ప్రత్యేక స్థానంతో గుర్తింపు తీసుకురావడానికి గల అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని, నష్టాలను తగ్గించుకోని ఆర్థికంగా బలోపేతం చేయడానికి తీసుకోవల్సిన సంస్కరణల విషయంపై అనువజ్ఞులైన నిపుణుల కమిటీ సూచించిన పిదప తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.నిపుణుల కమిటీ వారం లేదా 10 రోజులకొకసారి సమావేశమై ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడంతో పాటు కార్మికుల సమస్యలపై కూడా పరిష్కార మార్గాలను సూచించాలని ఆయన కోరారు. సంస్థ ఉన్నతాధికారులు, యూనియన్ నాయకుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని టి.ఎస్.ఆర్టీసీ పురోభివృద్ధి కోసం కమిటీ ఇచ్చే సిఫార్సులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.సమావేశంలో అధ్యక్షులు సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ, టి.ఎస్.ఆర్టీసీ పురోభివృద్ధిని కాంక్షించి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా ఆదాయ పెంపు కోసం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. సంస్థ ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి వాణిజ్యపరంగా వచ్చే ఆదాయ మార్గాలను కూడా పరిశీలించడం జరుగుతుందన్నారు. అన్నివర్గాల ప్రజలకు రవాణా సేవలు అందిస్తున్న టి.ఎస్.ఆర్టీసీ భవిష్యత్తు బాగు కోసం విశ్లేషించడం జరుగుతోందని, ఇటీవలే సంస్థ పురోగతిపై చర్చించిన అధ్యాయన కమిటీ పలు అంశాలను చర్చించిన అనంతరం ఒక అవగాహనకు వచ్చినట్లు చెప్పారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, టి.ఆర్.అండ్ బి ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ మాట్లాడుతూ, ప్రయాణీకులను, వినియోగదారులను ఆకట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు మొదలెట్టామని చెబుతూ బస్సుల అద్దె బుకింగ్ విధానాన్ని కూడా సరళీకరించామన్నారు. ఖాళీ స్థలాలను వ్యాపార సముదాయాలుగా మార్చేందుకు ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రయాణీకులకు సౌకర్యాలను ఎప్పటికప్పుడు మెరుగు పరుస్తూనే రాబడిని పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పునరుద్ఘాంటించారు. ఆర్థిక స్థితిగతులతో పాటు సంస్థకు వస్తున్న నష్టాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి పలు విషయాలపై అధ్యయన నిపుణుల కమిటీ సభ్యులు ప్రత్యేకంగా చర్చించారు. ప్రధానంగా ప్రధాన నగరాల్లో నడుస్తున్న సిటీ సర్వీసుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి గల అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. టి.ఎస్.ఆర్.టి.సి స్థలాల పరిశీలన, ప్రైవేట్ వాహనాల పోటీని తట్టుకుని నిలబడగలిగేలా ప్రత్యేక చర్యల వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఈ సందర్భంలో పలవురు సంస్థ ఉన్నతాధికారులు వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామనివారు తెలిపారు. అలాగే ప్రయాణీకుల ఫీడ్ బ్యాక్ల సమాచారాన్నికూడా కమిటీ సభ్యులు విశ్లేషించారు.బి.ఎం.టి.సి మాజీ ఛైర్మన్ నాగరాజు యాదవ్ ,సి.ఐ.ఆర్.టి మాజీ ఫ్యాకల్టీ హనుమంతరావు, మిగతా సభ్యులు అంథోని కుమార్, ప్రొఫెసర్ తివారి గీతం, పాటిక్ దవే, రిటైర్డ్ ఇ.డి డి.వేణు,ప్రొఫెసర్ ఎం.ఎన్ శ్రీహరి, డా.సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్, ఫ్యాకల్టీ సుదర్శన్ పాదంలు పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రెవెన్యూ, ఐటి), సంస్థ కార్యదర్శి పురుషోత్తం సమన్వయంతో జరిగిన ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు రవిందర్, శివకుమార్, సంస్థ ఉన్నతాధికారులు, గుర్తింపు యూనియన్ టి.ఎం.యూ ప్రధాన కార్యదర్శి అశ్వధ్ధామ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment