గుంటూరు, జూలై 21 (way2newstv.in)
వాళ్లు మంత్రులు.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండానే పదవులు చేపట్టారు.. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు.. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగాలని తెగ ఉబలాటపడుతున్నారు.. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు కరుణతో మంత్రి పదవులు దక్కించుకున్న వారిపై.. ప్రజలు కరుణ చూపుతారా..? అన్నదే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. గత ఎన్నికలకు ముందు ఉన్న రాజకీయ పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి.. ఈసారి టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. గత ఎన్నికల్లో ఉన్నంత పాజిటివ్ వేవ్ కనపడడం లేదు. ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న వీరికి ఏ నియోజకవర్గాలను కేటాయించాలన్నది కూడా పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా కనిపిస్తోంది. ఆ నలుగురు మంత్రులు ఎవరో కాదు చంద్రబాబు తనయుడు, పార్టీ యువనేత లోకేశ్, యనమల రామకృష్ణుడు, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రజాక్షేత్రంలో తమ సత్తా చాటుకునేందుకు ముందుకు వస్తారా..? లేదా సైలెంట్గా ఉండిపోతారా..? అనేది పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.
ఆ ఐదుగురు మంత్రులు సేఫ్ జోన్ కోసం ఎదురు చూపులు
పార్టీ ఆదేశిస్తే రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచైనా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మంత్రి లోకేశ్ ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని మూడు నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నా.. అందులో క్లారిటీ మాత్రం రావడం లేదు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సీటు చంద్రగిరి, నగరి స్థానాలు ఇందులో ఉన్నాయి. ఇక హిందూపురం స్థానాన్ని అల్లుడు లోకేశ్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే బాలయ్య బాబు వదులుకుంటారా.. అన్నది పెద్ద ప్రశ్న. ఇక్కడ పార్టీ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. బాలయ్య పనితీరుపై ప్రజల్లో కొంతమేరకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది.అయితే, సొంత సామాజికవర్గం బలంగా ఉండే.. విజయవాడ సమీపంలోని ఏదో ఒక నియోజకవర్గంలో లోకేశ్ను పోటీ చేయించే అవకాశాలు మాత్రం ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోకేశ్ కోసం పెనమలూరు లేదా గుడివాడ పేర్లు వినపడుతున్నా పెనమలూరు అయితేనే సేఫ్ అని చాలా మంది చెపుతున్నారు. ఇక మంత్రి యనమల కూడా గతంలో ఓడిపోయినా.. ఆయనను ఎమ్మెల్సీని చేసి, మంత్రిని చేశారు చంద్రబాబు. ఈసారి పోటీ చేయాలా వద్దా అన్న విషయంలో యనమల మల్లగులాలు పడుతున్నారు. ఆయన సొంత నియోజకవర్గం అయిన తునిలో యనమల ఫ్యామిలీపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పోటీ చేయకుండా మళ్లీ మండలికే వెళ్లి… తన కుమార్తెను కాకినాడ రూరల్ నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఆయన ఉన్నారు.మంత్రిగా కొనసాగుతున్న నారాయణ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. అదే రీతిలో ఎమ్మెల్సీ అయ్యారు. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా మంత్రి పదవి చేపట్టారు. నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్న నారాయణకు ధనబలం ఉంది. గత ఎన్నికల సమయంలో టీడీపీకి ఆర్థికంగా అండగా నిలిచినట్లు సమాచారం. అందుకే ఆయనకు చంద్రబాబు అంత ప్రాధాన్యం ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని మంత్రి నారాయణ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన సొంత జిల్లా నెల్లూరు అర్బన్ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. కానీ, ఇక్కడ వైసీపీ బలంగా ఉంటుంది. వైసీపీని తట్టుకుని నిలబడాలంటే.. ధనబలంతో పాటు ప్రజాబలం కూడా ఉండాలని, నారాయణకు కేవలం ధనబలమే తప్ప ప్రజా మద్దతు లేదని పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి. ఇక రూరల్ నియోజకవర్గంలో పోటీ అనుకున్నారు..ఆ తర్వాత కాపులు ఎక్కువుగా ఉన్న తిరుపతి పేరు కూడా నారాయణ కోసం వినపడింది.చివరకు అక్కడ పోటీ చేసి గెలవలేనని డిసైడ్ అయిన ఆయన ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఉన్న మంగళగిరి నుంచి పోటీ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పార్టీలో మరో సీనియర్, నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అయితే 2012 ఉప ఎన్నికలతో కలుపుకుని వరుసగా నాలుగుసార్లు ఓడిపోతూ వస్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లిలో పోటీ చేసి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలని ఆశ పడుతున్నా స్థానిక పరిస్థితులను బట్టి చూస్తే ఆయన గెలుపు సందేహంగానే ఉంది. దీంతో ఆయన కూడా మళ్లీ ఎమ్మెల్సీగానే వెళితే సేఫ్ అన్న ఆలోచనలో ఉన్నారు. సర్వేపల్లిలో ఆయన తన వారసుడిని రంగంలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైమైనా ఏపీ కేబినెట్లో నలుగురు మంత్రులు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుకూలమైన పరిస్థితులు లేక నానా ఇబ్బందులు పడుతుండడం ఆసక్తికరమే.
No comments:
Post a Comment