Breaking News

24/07/2018

నిఘా ఎక్కడ..?

మచిలీపట్నం, జూలై 24(way2newstv.in)
జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో సరైన నిఘా కొరవడింది. జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్తు ఆధ్వర్యంలో 15 ఆసుపత్రులున్నాయి. మచిలీపట్నం, కంకిపాడు, కైకలూరు, నందిగామ, ఉయ్యూరు, అవనిగడ్డ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు. విస్సన్నపేట, చల్లపల్లి, గూడూరు, పామర్రు సామాజిక, గుడివాడ, నూజివీడుల్లో ప్రాంతీయ ఆసుపత్రులున్నాయి. జిల్లా కేంద్రంలో ఏర్పాటైన ఆసుపత్రిలో మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మిగిలిన అన్ని చోట్లా ఏర్పాటు కాలేదు. ‌్ర విస్సన్నపేట సామాజిక ఆసుపత్రిలో 30 పడకలున్నాయి. ఆరు పడకలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా పనిచేస్తోంది. 200కుపైగా రోగులు రోజూ వస్తూ పోతుంటారు. ప్రసూతి విభాగం ఉంది. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు కాలేదు.ఇదే మండలం తెల్లదేవరపలిల్లో ఉన్నత స్థాయి ఆరోగ్య కేంద్రం ఉన్నా ఎలాంటి నిఘా లేదు.



నిఘా ఎక్కడ..?

తిరువూరు ఏరియా ఆస్పత్రిలో 50 పడకలున్నాయి. రోజూ 150 నుంచి 200 మంది రోగులు వస్తున్నారు. ప్రసూతి వైద్య విభాగం కూడా ఉంది. నెలలు నిండకుండా పుట్టినవారు, ఇతరత్రా రుగ్మతలతో పుట్టిన వారి కోసం పిల్లల సంరక్షణ కేంద్రం ఏర్పాటయ్యింది. నిరంతర నిఘా కోసం ఒక్క సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయలేదు. జిల్లా ఆసుపత్రికి భద్రత కల్పించే క్రమంలో ఆవరణలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోలీసులు వివిధ వార్డుల్లో పర్యటించి 8 ప్రాంతాల్లో కెమెరాలు అత్యవసరమని సూచించారు. వాటిలో ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ఆరు ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం వద్దే రెండు ఉన్నాయి. అయినా సంఘటనలు చేసుకోవడం నిఘా వైఫల్యం కనిపిస్తోంది. ఇటీవల వరకు  ప్రధానద్వారం నుంచే రాకపోకలు సాగించే వారు వైద్యఆరోగ్యశాఖ కమిషనర్‌ ఆదేశాలతో రోగుల సౌకర్యార్థం వెనుక గేటు నుంచి రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేయాలని సూచించడంతో దాన్ని కూడా తెరిచారు. అక్కడ సీసీ కెమెరా లేదు. ప్రస్తుతం అనుమానితులు ఆ గేటు నుంచే వస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏర్పాటైనవి కూడా పనిచేస్తాయో ఎన్నిరోజులు ఆగిపోతాయో తెలియని పరిస్థితి దాపురించింది. వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలి.
చల్లపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం తమ బంధువులు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ద్విచక్రవాహనంపై వచ్చి అక్కడ ఆపి లోపలికి వెళ్లారు. తిరిగి వచ్చే సరికి ఆ వాహనం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకొనే సమయంలో ఓ వ్యక్తి దాన్ని తీసుకొచ్చి అక్కడే పెట్టి వెళ్లారు.
జిల్లా ఆసుపత్రికి జిల్లా నలుమూలల నుంచి ప్రతిరోజూ వందలాది మంది రోగులు వస్తుంటారు. చికిత్స పొందేవారితోపాటు వారి వెంట వచ్చే కుటుంబ సభ్యులు ఉంటారు. దీన్ని అభివృద్ధి చేయడంతోపాటు పలు వసతులు, నిపుణులైన వైద్యులు, అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంచారు. రోగుల సంఖ్య పెరుగుతోంది. జిల్లా ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. ఇంతవరకు వాహనాలు నిలిపేందుకు పార్కింగ్‌కు చోటు కేటాయించలేదు. ఇటీవల దీనిపై ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో చర్చించి అంచనాలు తయారు చేసినా అక్కడ నుంచి ఒక్క అడుగు ముందుకు పడలేదు. వాహనాలను నిర్దేశిత ప్రదేశంలో నిలిపేలా చర్యలు తీసుకోవడానికి సిబ్బందిని కూడా నియమించారు. వార్డుల ముఖద్వారాల వద్ద కూడా వాహనాలు నిలిచి ఉండటంతో ప్రజలు, రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ఆసుపత్రిపై పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉంచడంతోపాటు అనుమానితులు సంచరించకుండా చర్యలు తీసుకునేందుకు గానూ వచ్చిపోయేవారి వివరాలు సేకరించాలని ఉన్నతాధికారులు  సూచించారు. ఇంతవరకు దాని ఊసేలేకుండా పోయింది. ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు..ఎందుకు వస్తున్నారు. తదితర వివరాలతో రిజిస్టర్‌ ఏర్పాటు చేస్తే చాలావరకు సమస్య పరిష్కారం అవుతుంది. వచ్చి వెళ్లినపుడు వారి సంతకాలు, మొబైల్ నెంబర్ తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది.

No comments:

Post a Comment